న్యూఢిల్లీ, జనవరి 18: కొత్త టెక్నాలజీలు ఆవిర్భవిస్తున్నా, వృద్ధి మందకొడిగా ఉన్నా ప్రపంచ ఐటీ పరిశ్రమలో ఆధిపత్యం చెలాయిస్తూ బ్రాండ్ వాల్యూను పెంచుకుంటున్న టాప్ త్రీలో యాక్సెంచర్, టీసీఎస్, ఇన్ఫోసిస్లు చోటుచేసుకున్నాయి. తాజాగా విడుదలైన బ్రాండ్ ఫైనాన్స్ 2024 రిపోర్ట్ ప్రకారం 40.5 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో యాక్సెంచర్ ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ సర్వీసుల బ్రాండ్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నది.
ఈ కంపెనీ బ్రాండ్ విలువ గత ఏడాదికంటే 1.6 శాతం పెరిగింది. ఐర్లాండ్లోని డబ్లిన్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న యాక్సెంచర్కు భారత్లో హైదరాబాద్తో సహా పలు నగరాల్లో కార్యాలయాలు ఉన్నాయి. భారత్లోనే ఈ కంపెనీకి 3 లక్షలమేర ఉద్యోగులున్నారు. దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ 19.2 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో టాప్-బ్రాండ్స్ లిస్ట్లో ద్వితీయస్థానంలో ఉన్నది. జాబితాలో అన్నింటికంటే అధికంగా బ్రాండ్ విలువను ఏడాదిలో 2 బిలియన్ డాలర్ల (11 శాతం వృద్ధి) మేర ఇది పెంచుకుంది. పలు వృద్ధి విభాగాల్లో తాము చేసిన పెట్టుబడుల కారణంగా బ్రాండ్ విలువ పెరిగిందని రిపోర్ట్లో పేర్కొన్నారు.
మరో దేశీ సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ 14.2 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో మూడో ర్యాంక్లో కొనసాగింది. అలాగే ఇన్ఫీ సీఈవో సలీల్ పరేఖ్ 2024 సంవత్సరానికి నంబర్ ఒన్ ఐటీ సర్వీసుల సీఈవోగా గుర్తింపు పొందారు. భారత్లో మూడో పెద్ద ఐటీ కంపెనీ అయిన హెచ్సీఎల్ టెక్నాలజీస్ 6.5 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో 8వ స్థానంలో ఉన్నది. బ్రాండ్ విలువను వేగంగా 16 శాతం వృద్ధిపర్చుకున్న కంపెనీ ఇదేకావడం గమనార్హం. అజీం ప్రేమ్జీ ప్రమోట్ చేసిన విప్రో బ్రాండ్ విలువ మాత్రం 7.6 శాతం తగ్గింది. వ్యాపారాన్ని టర్న్ ఎరౌండ్ చేయడంలో సవాళ్లను ఎదుర్కొంటున్న విప్రో నుంచి 2023లో పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్లు వైదొలిగారు.
టాప్ టెన్ ఐటీ బ్రాండ్స్
ర్యాంక్ కంపెనీ : బాండ్ విలువ (బిలియన్ డాలర్లలో)
1. యాక్సెంచర్ : 40.50
2. టీసీఎస్ : 19.16
3. ఇన్ఫోసిస్ : 14.04
4. ఐబీఎం కన్సల్టింగ్ : 12.10
5. క్యాప్ జెమిని : 10.21
6. ఎన్టీటీ డాటా : 8.93
7. కాగ్నిజెంట్ : 8.64
8. హెచ్సీఎల్ టెక్ : 7.57
9. విప్రో : 5.76
10. ఫుజిట్సు ఐటీ : 4.33