Accenture : వర్కింగ్ కల్చర్ను ఏఐ మార్చేస్తోంది. రాకెట్లా దూసుకెళ్తున్న ఏఐని ఇప్పుడు కొన్ని కంపెనీలు వరప్రసాదంలా భావిస్తున్నాయి. ఉద్యోగుల చేత ఏఐని తప్పనిసరిగా వాడేలా చేస్తున్నాయి. తాజాగా టెక్ కంపెనీ యాక్సెంచర్ ఈ విషయంలో ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా సీనియర్ ఉద్యోగులు ఏఐని తప్పనిసరిగా వాడాలని సూచించింది. లేకుంటే ప్రమోషన్లు కట్ చేస్తామని హెచ్చరించింది.
ఇప్పటికే గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఇదే తరహా ఆదేశాలు జారీచేశాయి. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సదస్సులో యాక్సెంచర్ సీఈవో జూలీ స్వీట్ మాట్లాడారు. భవిష్యత్ అంతా ఏఐదేనని, కంపెనీలు ఏఐ వాడకాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. కొన్ని దశాబ్దాలుగా వర్కింగ్ కల్చర్ మారుతోందని, వర్క్ ఫోర్స్ను మారుతున్న కాలానికి అనుగుణంగా ఏఐ వైపు మళ్లించేలా కంపెనీలు వ్యవహరించాలన్నారు. ఇదే నేపథ్యంలో ఇటీవల తమ కంపెనీలోని సీనియర్ ఉద్యోగులైన అసోసియేట్ డైరెక్టర్స్, సీనియర్ మేనేజర్లు వంటి వాళ్లు ఏఐ టూల్స్ వాడటం నేర్చుకోవాలని యాక్సెంచర్ ఆదేశించింది. ఈ మేరకు ఉద్యోగులకు మెయిల్స్ పంపింది. లేకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కూడా హెచ్చరించింది.
ప్రస్తుతం యాక్సెంచర్ సంస్థ ఏఐ మీద దృష్టి పెట్టింది. అందువల్లే ఏఐలో సరైన స్కిల్స్ లేని 11,000 మంది ఉద్యోగుల్ని కూడా తొలగించింది. సిబ్బందిని తొలగించే సమయంలో మూడేళ్లలో 2 బిలియన్ డాలర్లను ఉద్యోగులకు చెల్లించింది. మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్ వంటి కంపెనీలు కూడా ఏఐని అడాప్ట్ చేసుకోవాలని ఉద్యోగులకు సూచించింది. అలా చేయలేని వాళ్లు స్వచ్ఛందంగ ఉద్యోగ విరమణ చేయవచ్చని, అలాంటివారికి మంచి ప్యాకేజీలు కూడా అందిస్తామని వెల్లడించింది.