న్యూఢిల్లీ : తమ నియామక ప్రక్రియలో నకిలీ ఎక్స్పీరియన్స్ లెటర్స్ను అందించి కంపెనీని తప్పుదారి పట్టించిన ఉద్యోగులపై ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ యాక్సెంచర్ వేటు వేసింది. కంపెనీలో ఉద్యోగం పొందేందుకు నకిలీ ఎక్స్పీరియన్స్ లెటర్, ఇతర తప్పుడు పత్రాలను సమర్పించిన ఉద్యోగులను తొలగించామని యాక్సెంచర్ పేర్కొంది. తాము కఠిన వాణిజ్య నైతిక విలువలను అనుసరిస్తామని, వీటికి అనుగుణంగా వ్యవహరించని వారిని ఉపేక్షించబోమని యాక్సెంచర్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
భారత్లో యాక్సెంచర్ ఉద్యోగం కోసం తప్పుడు కంపెనీల నుంచి కొందరు నకిలీ ఎంప్లాయ్మెంట్ లెటర్స్, నకిలీ పత్రాలను సమర్పించిన విషయం తమ దృష్టికి వచ్చిందని, తమ క్లైంట్లకు సేవలందించే క్రమంలో ఆ సామర్ధ్యంపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేందుకు చర్యలు చేపట్టామని తెలిపింది. యాక్సెంచర్లో జాబ్ నిమిత్తం కొందరు వ్యక్తులు, నిర్ధిష్ట ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీలు ప్రజలను డబ్బు అడుగుతున్నట్టు తమకు సమాచారం అందిందని పేర్కొంది.
యాక్సెంచర్లో ఉద్యోగం ఇచ్చే క్రమంలో డబ్బు వసూలు చేయాలని తాము ఏ సంస్ధకు, వ్యక్తికి అధికారం ఇవ్వలేదని తేల్చిచెప్పింది. నకిలీ జాబ్ ఆఫర్ల పట్ల అభ్యర్ధులు అప్రమత్తంగా ఉండాలని బ్లాగ్ పోస్ట్లో యాక్సెంచర్ హెచ్చరించింది. రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఏ దశలోనూ తాము ఫీజు వసూలు చేయబోమని పేర్కొంది. యాక్సెంచర్లో జాబ్ కోసం ఏ ఒక్కరూ డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని కంపెనీ స్పష్టం చేసింది.