న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: ఈ వేసవి కాలంలో ఠారెత్తించే ఎండలకు తగ్గట్టుగానే.. ఎయిర్ కండీషనర్ల (ఏసీ) ధరలూ ఎగిసిపడటం ఖాయంగానే కనిపిస్తున్నది. రాబోయే సమ్మర్ సీజన్లో ఏసీల రేట్లు పెరుగుతాయని ఆయా సంస్థలు ఇప్పట్నుంచే సంకేతాలు ఇస్తున్నాయి మరి. ఈ క్రమంలోనే ఏసీల తయారీ దిగ్గజం బ్లూ స్టార్ ఈ త్రైమాసికంలో తమ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని స్పష్టం చేసింది. తాజాగా ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) బీ త్యాగరాజన్ ఓ ప్రము ఖ జాతీయ వార్తా సంస్థతో మా ట్లాడుతూ.. ఈసారి ధరల పెంపు తప్పేటట్టు లేదు అన్నారు.
పెరిగిన ఉత్పాదక వ్యయం, ఎనర్జీ-ఎఫీషియన్సీ లేబులింగ్లో మార్పులు, ఎగిసిన ఎక్సేంజ్ రేట్లు.. ఏసీల ధరలకు రెక్కల్ని తొడుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సమ్మర్లో ఆయా బ్రాండ్ ఏసీల ధరలు 10 నుంచి 15 శాతం పెరుగవచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. దీన్ని బ్లూ స్టార్ ఎండీ త్యాగరాజన్ ధ్రువీకరించారు. పన్నులు, వడ్డీ చెల్లింపులకు ముందు ఆర్జించే ఆదాయాల్లో ఇండస్ట్రీ వాటా 8-10 శాతంగానే ఉంటున్నదని, కాబట్టి తయారీ ఖర్చుల భారాన్ని భరించే పరిస్థితుల్లో కంపెనీలు లేవని ఆయన అన్నారు. రాగి ధరలు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయాయని, ఇతర కీలక ఉత్పత్తుల రేట్లు కూడా పెరిగాయని గుర్తుచేశారు. అందుకే కొనుగోలుదారులపై ఈ భారాన్ని మోపక తప్పట్లేదని వ్యాఖ్యానించారు.
ఏసీ అమ్మకాల్లో స్టార్ రేటింగ్కున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. సదరు ఏసీల వినియోగానికి ఖర్చయ్యే విద్యుత్తుకు ఇవే ప్రామాణికాలు మరి. అందుకే ఎంత రేటింగ్ ఎక్కువగా ఉంటే.. అంత కరెంట్ తక్కువగా వాడకం అవుతుందని కొనుగోలుదారులు ఏరికోరి ఎంచుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో పెరిగే ధరల్లో తప్పనిసరి ఎనర్జీ లేబుల్ అప్గ్రేడ్ వాటానే ఎక్కువని త్యాగరాజన్ చెప్తున్నారు. స్టార్ రేటింగ్ ఆధారంగా 5-10 శాతం ధరలు పెరుగుతాయని అంటున్నారు. 3 స్టార్తో పోల్చితే 5 స్టార్ రేటింగ్ ఏసీల ధరలు ఇంకా ఎక్కువవుతాయని స్పష్టం చేస్తున్నారు.
రాబోయే రోజుల్లో ధరలు పెరుగుతాయని ముందే పసిగడుతున్న డీలర్లు.. ఇప్పట్నుంచే ఏసీ నిల్వలను పెంచేసుకుంటున్నారని త్యాగరాజన్ చెప్తున్నారు. వారి నుంచి ఆర్డర్లు మొదలవుతున్నాయన్నారు. అయితే ఉష్ణోగ్రతలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయని, కనుక 10 రోజుల్లో సేల్స్, ఆర్డర్లు ఊపందుకోవచ్చన్న విశ్వాసాన్ని ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. నిజానికి గత ఏడాదితో పోల్చితే రాత్రి ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగినట్టు తెలుస్తున్నదని, దీన్నిబట్టి ఈసారి ఎండల తీవ్రత ముందుగానే మొదలవుతుందని, మే నెలలో చాలా అధికంగా ఉండవచ్చన్న అభిప్రాయాన్ని త్యాగరాజన్ వెలిబుచ్చారు. ఇదే జరిగితే ఏసీలకు ఈసారి డిమాండ్ బాగా ఉంటుందన్న ఆశాభావాన్ని కనబర్చారు.
ఈ సమ్మర్ సీజన్లో ఇండ్లలో ఏసీల వినియోగంతోపాటు కార్యాలయాల్లో వాడకం కూడా పెరుగవచ్చని త్యాగరాజన్ అంచనా వేస్తున్నారు. ప్రధానంగా డాటా సెంటర్ల నుంచి డిమాండ్ ఉంటుందంటున్నారు. దేశవ్యాప్తంగా డాటా సెంటర్ల నిర్వాహకులు పెట్టుబడులు, సామర్థ్య పెంపునకు ఆసక్తి కనబరుస్తుండటమే ఇందుకు కారణంగా అభివర్ణిస్తున్నారు.