Aadhar Card | ఆధార్ కార్డు.. భారత్లో ప్రతి పౌరుడి గుర్తింపునకు ఉపయోగించే కార్డు ఇది. ఇప్పుడు జననం మొదలు స్కూల్ అడ్మిషన్.. బ్యాంకులో ఖాతా తెరవాలన్నా.. ఏం చేయాలన్నా ఆధార్ కార్డు కావాల్సిందే. అయితే, ఆధార్ కార్డులో పొరపాట్లు చేసుకోవడం, అప్ డేట్లు నమోదు చేయాల్సి రావచ్చు. ఆధార్ కార్డులో కరెక్షన్లు చేపట్టేందుకు విశిష్ట ప్రాధికారసంస్థ (యూఐడీఏఐ) కఠిన మార్గదర్శకాలు తీసుకొచ్చింది. ఆధార్ కార్డులను దుర్వినియోగం చేయకుండా యూఏడీఏఐ కఠినమైన మార్గదర్శకాలు అమల్లోకి తెచ్చినట్లు తెలుస్తున్నది.
ఇప్పటి నుంచి ఆధార్ కార్డులో సభ్యుడి చిరునామా మార్చాల్సి రావచ్చు. గెజిటెడ్ అధికారుల అటెస్టెడ్ సంతకాలు చేసిన సర్టిఫికెట్ల ప్రతులను సమర్పించి చిరునామా మార్చుకోవచ్చు. కానీ, ఆధార్ కార్డులో ఇతర మార్పులు, చేర్పులకు మాత్రం ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించాల్సిందే. పేరులోగానీ, చిరునామాలో గానీ స్పెల్లింగ్ మిస్టేక్స్, ఇతర పొరపాట్లు సరిదిద్దుకోవాల్సి వస్తే ఆధార్ సేవా కేంద్రంలో రూ.1000 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.
పౌరుల ఆధార్ కార్డుల సవరణలకు సంబంధించి పొరపాట్లు ఉన్న సర్టిఫికెట్లు, అప్లికేషన్లను ఆమోదిస్తే సంబంధిత ఆధార్ సేవా కేంద్రంపై యూఐడీఏఐ రూ.10 వేల వరకు ఫైన్ విధిస్తుంది. ఎస్ఎస్ఎల్సీ బుక్స్, ఓటర్ గుర్తింపు కార్డులకు సంబంధించి అస్పష్టమైన పత్రాలు సమర్పించినా ఆధార్ సేవా కేంద్రాలు భారీ ఫైన్ చెల్లించాల్సిందే.
ఆధార్ కార్డుల జారీకి పౌరులు ఇచ్చిన అన్ వెరిఫైడ్ పత్రాలు సమర్పించినందుకు పలు ఆధార్ సేవా కేంద్రాల లైసెన్సులు కూడా యూఐడీఏఐ రద్దు చేసింది. లైసెన్సుల రద్దు మాత్రమే కాదు లక్షల్లో పెనాల్టీలు చెల్లించాల్సి రావడంతో కుటుంబ జీవనం కోసం అక్షయ కేంద్రాలు, ఇతర సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేసిన దివ్యాంగుల కుటుంబాలు తీవ్ర కష్టాల్లో చిక్కుకున్నాయి.
సీనియర్ సిటిజన్లు తమ పేర్లు, ఇంటి అడ్రస్ తదితర వివరాల్లో మార్పులు, చేర్పుల కోసం ఆధార్ సేవాకేంద్రాల వద్ద అస్పష్టమైన, అన్ వెరిఫైడ్ పత్రాలను సమర్పించినట్లు తెలుస్తున్నది. ఒక్కో ఆధార్ కార్డుపై ప్రతి సింగిల్ సర్వీసుకు సంబంధిత ఆధార్ సేవా కేంద్రానికి యూఐడీఏఐ రూ.36 ఫీజు పే చేస్తున్నది.