న్యూఢిల్లీ, ఏప్రిల్ 18 : సంస్థాగత సేవలే అయినప్పటికీ ఆ సంస్థకు రెండు, అంతకుమించి రిజిస్ట్రేషన్లుంటే.. హెడ్ ఆఫీస్కు బ్రాంచ్ ఆఫీస్ నుంచి అందే సేవలకు కూడా 18 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వర్తిస్తుందని అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్) స్పష్టం చేసింది. ప్రొఫిసొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్.. పారిశ్రామిక, తయారీ ప్రాజెక్టుల కోసం ఇంజినీరింగ్ సేవలను అందించే సంస్థ. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం కర్నాటకలోని బెంగళూరులో ఉన్నది. అయితే తమిళనాడులోని చెన్నైలో దీనికి ఓ శాఖ ఉన్నది. దీంతో ప్రొఫిసొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు అటు కర్నాటకలో, ఇటు తమిళనాడులోనూ వేర్వేరు జీఎస్టీ రిజిస్ట్రేషన్లున్నాయి. కాగా, ఈ శాఖ నుంచి ప్రధాన కార్యాలయానికి ఇంజినీరింగ్, డిజైన్, అకౌంటింగ్ తదితర సేవలు అందుతున్నాయి. దీంతో తమ బ్రాంచీ నుంచి తమ హెడ్ ఆఫీస్కే అందుతున్న ఈ సేవలకూ జీఎస్టీ వర్తిస్తుందా? అని కంపెనీ ఏఏఆర్ను ఆశ్రయించింది. అయితే ఒకే సంస్థ అయినప్పటికీ రెండు రాష్ర్టాల్లో కార్యకలాపాలుండటం, వాటికి వేర్వేరు జీఎస్టీ రిజిస్ట్రేషన్లున్నందున జీఎస్టీ చెల్లించాల్సిందేనని తమిళనాడు ఏఏఆర్ తేల్చిచెప్పింది.
కేంద్ర జీఎస్టీ, రాష్ట్ర జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ, కేంద్ర పాలిత జీఎస్టీలకు లోబడి రెండు, ఆపై రిజిస్ట్రేషన్లుంటే.. హెడ్ ఆఫీస్కు బ్రాంచ్ ఆఫీస్ నుంచైనా, బ్రాంచ్ ఆఫీస్కు హెడ్ ఆఫీస్ నుంచి అందే సేవలకైనా ఆ కంపెనీ 18 శాతం జీఎస్టీ కట్టాల్సిందేనని ఎన్ ఉషా, ఆర్ గోపాలస్వామిలతో కూడి కమిటీ పేర్కొన్నది. హెడ్ ఆఫీస్ కోసమో లేదా బ్రాంచ్ ఆఫీస్ కోసమో ప్రత్యేకంగా మేము ఉద్యోగులను నియమించుకోలేదని, ఎంప్లాయీస్ అంతా ఒక్కటేనని కంపెనీ అధికార ప్రతినిధి గణేశ్ భట్ ఈ సందర్భంగా ఏఏఆర్ ప్యానెల్ ముందు వాదించినా ఫలితం లేకపోయింది. జీఎస్టీ కింద వ్యాపార, పారిశ్రామిక సంస్థలకు తమ కార్యకలాపాలున్న ప్రతి రాష్ట్రంలోనూ రిజిస్ట్రేషన్ తప్పనిసరన్నది తెలిసిందే. కాగా, ఒకే రాష్ట్రంలోనైనా సంస్థకు ఒకే పాన్ కార్డుపై రెండు వేర్వేరు జీఎస్టీ రిజిస్ట్రేషన్లుంటే.. వాటి మధ్య జరిగే సేవలకూ జీఎస్టీ పడుతుందని ఏఏఆర్ ఈ సందర్భంగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఆర్థిక సేవలు, స్వచ్చంధ సేవా సంస్థల కార్యకలాపాలు వంటి పన్ను మినహాయింపు సేవలు, రంగాలకు పెద్ద ఎత్తునే పన్ను సంబంధిత సమస్యలు తలెత్తవచ్చన్న అభిప్రాయాలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి.
‘ఈ పన్ను విధానంలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. దానివల్ల పన్ను చెల్లింపుదారులు నష్టపోతున్నారు. నిబంధనల్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది’
-రజత్ మోహన్, ఏఎంఆర్జీ అండ్ అసోసియేట్స్ పార్ట్నర్
‘ఈ రకమైన పన్నుల వ్యవస్థ కంపెనీలకు కొత్త సవాళ్లను సృష్టించగలవు. ఏదిఏమైనా ఏఏఆర్ తాజా ఆదేశం మరో నూతన చర్చకు తెరతీస్తున్నది అనడంలో సందేహం లేదు’
-అభిషేక్ జైన్, కేపీఎంజీ ఇండియా పార్ట్నర్