Gautam Adani | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: తీవ్ర వివాదంలో చిక్కుకున్న వాణిజ్యవేత్త గౌతమ్ అదానీ సంపద మంచులా కరిగిపోతున్నది. నెలరోజుల క్రితం ఫోర్బ్స్ ప్రపంచ శ్రీమంతుల జాబితాలో 120 బిలియన్ డాలర్లకుపైగా సంపదతో 3వ స్థానంలో నిలిచిన అదానీ ఈ సోమవారం 38వ స్థానానికి దిగిపోయారు. ఆయన తాజా సంపద 33.4 బిలియన్ డాలర్లు. ప్రపంచ కుబేరుల సంపదను గణించే మరో అంతర్జాతీయ సంస్థ బ్లూంబర్గ్ సంపన్నుల జాబితా ప్రకారం అదానీ సంపద తొలిసారిగా 40 బిలియన్ డాలర్లలోపునకు పడిపోయింది. బ్లూంబర్గ్ లిస్ట్లో ప్రస్తుత అదానీ సంపద 39.9 బిలియన్ డాలర్లు కాగా, 30వ స్థానంలో నిలిచారు. వాస్తవానికి గత ఏడాది సెప్టెంబర్లో 155 బిలియన్ డాలర్ల సంపదతో కొద్దిరోజుల పాటు ప్రపంచ శ్రీమంతుల జాబితాలో ద్వితీయస్థానానికి ఎగబాకిన అదానీ తదుపరి చాలావారాలపాటు మూడో ర్యాంక్లో కొనసాగారు. అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ అదానీ గ్రూప్ కార్పొరేట్ అవకతవకలపై తీవ్ర ఆరోపణలు చేసిన తర్వాత గౌతమ్ అదానీ సంపద వేగంగా ఆవిరైపోతూ వస్తున్నది. కేవలం నెలరోజుల్లోనే అదానీ ఐశ్వర్యం 90 బిలియన్ డాలర్ల మేర కరిగిపోయింది. తాజా ఫోర్బ్స్ బిలియనీర్ల ఇండెక్స్లో అగ్రస్థానంలో ఫ్రాన్స్ ఫ్యాషన్, రియల్టీ దిగ్గజం ఎల్వీఎంహెచ్ అధినేత బెర్నాల్డ్ ఆర్నాల్ట్ 207 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. తదుపరి స్థానాల్లో టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ (190.8 బిలియన్ డాలర్లు), అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ (116.7 బిలియన్ డాలర్లు) ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ 83.5 బిలియన్ డాలర్ల సంపదతో 8వ స్థానంలో నిలిచారు.
హిండెన్బర్గ్ రిపోర్ట్ వెలువడిననాటి నుంచి అదానీ గ్రూప్లోని 10 లిస్టెడ్ కంపెనీలు రూ.12.06 లక్షల కోట్ల మార్కెట్ విలువను కోల్పోయాయి. ఇవి నష్టపోయిన విలువ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మొత్తం మార్కెట్ విలువకు దాదాపు సమానం. గ్రూప్ కంపెనీల్లో అదానీ టోటల్ గ్యాస్ నెలరోజుల్లో 80.68 శాతం విలువను కోల్పోగా, అదానీ గ్రీన్ ఎనర్జీ 74.62 శాతం నష్టపోయింది. అదానీ ట్రాన్స్మిషన్ 74.21 శాతం, గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ 62 శాతం మేర నష్టపోయాయి. సోమవారం సైతం అదానీ గ్రూప్ షేర్ల క్షీణత కొనసాగింది. అదానీ ఎంటర్ప్రైజెస్ అన్నింటికంటే అధికంగా 9.5 శాతం పడిపోయి రూ.1,193 వద్ద ముగిసింది. అదానీ గ్రీన్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ పవర్, అదానీ విల్మార్, అదానీ టోటల్ గ్యాస్, ఎన్డీటీవీ షేర్లు స్టాక్ ఎక్సేంజీలు అనుమతించిన 5 శాతం లోయర్ సర్క్యూట్ వద్ద ఫ్రీజ్ అయ్యాయి. అదానీ గ్రూప్ ఇటీవల టేకోవర్ చేసిన సిమెంట్ కంపెనీలు అంబూజా సిమెంట్స్ షేరు 4.5 శాతం, ఏసీసీ 2 శాతం చొప్పున నష్టపోయాయి. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ మాత్రం గ్రీన్లో ముగిసింది.
అదానీ కంపెనీల్లో భారీగా పెట్టుబడి చేసిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)కు సైతం అదానీ గ్రూప్ సెగ గట్టిగానే తగులుతున్నది. సోమవారం ఈ షేరు 3 శాతం మేర క్షీణించి రికార్డు కనిష్ఠస్థాయి రూ. 568 వద్ద ముగిసింది. ఎల్ఐసీ షేరు తగ్గుదలతో ముగియడం వరుసగా ఇది ఏడవ ట్రేడింగ్ రోజు. గత ఏడాది మధ్యలో స్టాక్ మార్కెట్లో లిస్టయినప్పటి నుంచి ఇన్వెస్టర్లకు ఎల్ఐసీ నష్టాల్నే చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలకాలంలో అదానీ షేర్ల ప్రభావంతో ఎల్ఐసీ షేరు పతనం వేగవంతమయ్యింది. అదానీ గ్రూప్ షేర్లలో రూ. 30,000 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసిన ఎకైక దేశీ సంస్థ ఎల్ఐసీయే కావడం గమనార్హం. హిండెన్బర్గ్ రిపోర్ట్ వెలువడక ముందు అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టుబడి విలువ రూ. 81,000 కోట్ల మేర ఉండగా, అది కాస్తా నెలరోజుల్లో రూ. 26,000 కోట్ల సమీపానికి పడిపోయింది. షేరుకు రూ.949 ధరతో ఎల్ఐసీ షేర్లను గత ఏడాది మే నెలలో కేంద్ర ప్రభుత్వం పబ్లిక్కు విక్రయించగా, ఆ షేరు రూ.867 ధర వద్ద మార్కెట్లో లిస్టయ్యింది.