హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. పారిశ్రామికవేత్తలకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. పరిశ్రమల అభివృద్ధి, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను సులభంగా మంజూరు చేస్తామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఫాక్స్కాన్కు చెందిన హాన్హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి వీలీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డితో సమావేశమైంది.
ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. కొంగరకలాన్లో ఏర్పాటుచేస్తున్న ఫాక్స్కాన్ ఉత్పాదక కేంద్రం నిర్వహణకు, సంస్థ భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టులకు కూడా ప్రభుత్వం తరఫున తగిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ర్టాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని తెలిపారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తైవాన్కు చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్కాన్ తెలంగాణలో పరిశ్రమ స్థాపనకు కేసీఆర్ ప్రభుత్వంతో గత మార్చిలోనే ఒప్పందం చేసుకున్నది. ప్రభుత్వం కొంగరకలాన్లో భూమిని కేటాయించగా, గత మేలో అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ఫాక్స్కాన్ మన రాష్ట్రంలో దశలవారీగా 550 మిలియన్ డాలర్ల్ల పెట్టుబడి పెట్టనున్నది. తద్వారా లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని, మొదటి దశలో, వచ్చే రెండేండ్లలో 25,000 ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఫాక్సాకాన్ సంస్థ ప్రధానంగా ఆపిల్ ఐఫోన్లను తయారుచేస్తుంది.
సంస్థ ప్రధాన కస్టమర్లలో గూగుల్, జియోమీ, అమెజాన్, హ్యూలెట్ ప్యాకర్డ్, హ్యూవాయ్, సిస్కో, నెన్టెండో, సెగా అలీబాబా గ్రూప్, డెల్, ఫేస్బుక్, సోనీ, మైక్రోసాఫ్ట్, నోకియా తదితర కంపెనీలు ఉన్నాయి. చైనా, వియత్నాం, థాయ్లాండ్, మలేషియా, అమెరికా, యూరప్, భారత్ సహా 24 దేశాల్లో సంస్థ కార్యకలాపాలు సాగిస్తున్నది. మన దేశంలో శ్రీసిటీ (ఏపీ), శ్రీపెరంబదూర్(తమిళనాడు), తెలంగాణ(కొంగరకలాన్), బెంగళూరు(కర్ణాటక)లో పరిశ్రమలను ఏర్పాటుచేసింది.