భారతీయ బ్యాంకింగ్ రంగాన్ని మొండి బకాయిలు కలవరపెడుతున్నాయి. బడా కార్పొరేట్ల బాకీలు బ్యాంకులను వేధిస్తున్నాయి మరి. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతలు పెరిగిపోతున్నాయి. గడిచిన పదేండ్లలో పదింతలై రూ.23వేల కోట్ల నుంచి రూ.2.4 లక్షల కోట్లకు ఎగబాకాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
న్యూఢిల్లీ, జూలై 18: భారతీయ బ్యాంకులు ఉద్దేశపూర్వక రుణ ఎగవేతల (విల్ఫుల్ డిఫాల్టర్స్)తో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలనతో గడిచిన పదేండ్లలో ఆయా ప్రభుత్వ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని, ఆపై కట్టని మొత్తాలు ఏకంగా పదింతలకుపైగా పెరగడం గమనార్హం. సిబిల్ వివరాల ప్రకారం ఈ ఏడాది మే 31 నాటికి ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు రూ.2.4 లక్షల కోట్లు ఎగ్గొట్టారు. పదేండ్ల క్రితం ఇది రూ.23,000 కోట్లే. రూ.25 లక్షలు, అపై రుణాల ఎగవేతల్ని పరిగణనలోకి తీసుకుంటేనే ఈ స్థాయిలో ఉన్నాయి. మొత్తం ఎగవేతల్ని లెక్కిస్తే భారీగానే పెరుగుతాయి. ఇక ఈ రూ.2.4 లక్షల కోట్లను 12వేలకుపైగా డిఫాల్టర్లు ఎగ్గొట్టారు. వీటిలో రూ.కోటి దిగువన ఉన్న రుణాలు కేవలం 1 శాతంపైనే. రూ.100 కోట్లకుపైగా అప్పుల వాటానే 58 శాతంగా ఉన్నది.
ఉద్దేశపూర్వకంగానే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వివరాల ప్రకారం ఉద్దేశపూర్వకంగానే రుణాలను కార్పొరేట్లు ఎగ్గొడుతున్నారు. తీసుకున్న అప్పును తిరిగి చెల్లించే స్థోమత ఉన్నప్పటికీ.. చెల్లించడం లేదని తేలింది. రుణాల నిధులనూ పక్కదారి పట్టిస్తున్నారు. వేర్వేరు బ్యాంకుల్లో తప్పుడు ధ్రువపత్రాలతో రుణాలు తీసుకుని ఎగవేస్తున్నారన్న ఆర్బీఐ.. రిషీ అగర్వాల్కు చెందిన ఏబీజీ గ్రూప్ ఏడు ఖాతాల్లో రూ.6,382 కోట్లు ఎగ్గొట్టిందని చెప్పింది. జాబితాలో గీతాంజలి జెమ్స్, శక్తి భోగ్ ఫుడ్స్, సింటెక్స్ ఇండస్ట్రీస్, రోటోమ్యాక్ గ్లోబల్, డెక్కన్ క్రానికల్, ఎస్ కుమార్స్ సంస్థలున్నాయి.
మాల్యా, నీరవ్లను మించే..
బ్యాంకులకు రూ.9,000 కోట్లు ఎగ్గొట్టి ఏడేండ్ల క్రితం విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోయినది తెలిసిందే. దేశంలోనే భారీ కుంభకోణం రూ.14,000 కోట్ల పీఎన్బీ కేసులో సూత్రధారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలన్నది విదితమే. విక్రమ్ కొఠారి, టీ వెంకట్రామి రెడ్డి పేర్లనూ విన్నాం. అయితే వీరిని మించినవారెందరో ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల్లో ఉన్నారు. రిషీ అగర్వాల్, అర్వింద్ ధామ్, నితిన్-చేతన్ సందేసారాలు, కపిల్-ధీరజ్ వాధవాన్లు, సంజయ్-సందీప్ జున్జున్వాలాలు, సంజయ్ కుమార్, అతుల్ పుంజ్, జతిన్ మెహెతా, నితిన్ కస్లీవాల్లున్నారు.
రూ.100 కోట్లతో..
బ్యాంకుల నుంచి ఎడాపెడా అప్పులు తీసుకుని.. ఆపై అడ్డగోలుగా ఎగవేస్తున్నవారెందరో. వందల కోట్ల రూపాయలు ముంచేసి దర్జాగా తిరిగేస్తున్నారు. అయితే మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా ఉన్న ఈ దేశంలో రూ.100 కోట్లు కూడబెట్టాలంటే.. ఏటా రూ.10 లక్షలు పోగేసినాసరే వెయ్యేండ్లు పడుతుంది. స్విస్ బ్యాంకుల్లో పదేండ్లు, ఆపై కాలానికి బాండ్లలో పెట్టుబడిగా రూ.100 కోట్లు పెట్టినా ఏటా వడ్డీ 1.15 కోట్లు (నెలకు రూ.9.6 లక్షలు) పొందవచ్చు. రూ.50 లక్షల విలువైన 200 అపార్ట్మెంట్లు లేదా 190 కిలోలకుపైగా బంగారాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాంటిది లక్షల కోట్ల రూపాయలను మోసగాళ్లు అప్పనంగా మింగేస్తున్నారు. అయినా మోదీ సర్కారు చోద్యం చూస్తూనే ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సామాన్యుడు పదివేలు ఎగ్గొట్టినా జప్తు చేసే బ్యాంకర్లు.. కార్పొరేట్లు లక్షల కోట్లు ఎగ్గొట్టినా రద్దు చేస్తుండటానికి వ్యవస్థలోని లోపాలే కారణమంటున్నారు.