PM Modi | బ్యాంకు అంటే ఓ భరోసా… ఓ నమ్మకం. కడుపుకట్టుకొని సామాన్యుడు దాచుకొన్న డబ్బును కంటికి రెప్పలా కాపాడుతుందన్న ఓ నమ్మకం. బిడ్డ పెండ్లికో, కొడుకు పైచదువుకో, ఆపత్కాల సమయం వచ్చినప్పుడో ఆత్మబంధువులా ఆదుకొంటుందనే ధైర్యం.
నిన్నటివరకూ దేశంలోని ప్రతీ మధ్యతరగతి జీవికి బ్యాంకులపై ఉన్న నమ్మకం ఇదే.
అయితే, కేంద్రంలోని బీజేపీ సర్కారు అనాలోచిత విధానాలు.. కార్పొరేట్లకు కొమ్ముకాసే ప్రయత్నాలతో సామాన్యుల సొమ్ము ఇప్పుడు ప్రమాదంలో పడిపోయింది. రూ. లక్షల కోట్లను బ్యాంకులకు ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టిన ఎగవేతదారులకు మళ్లీ రుణాలు ఇచ్చేలా రిజర్వుబ్యాంక్ నిర్ణయం తీసుకోవడం.. బ్యాంకు ఖాతాల్లోని సామాన్యుల సొమ్ముకు గ్యారంటీ లేకుండా పోయింది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): మధ్యతరగతి ప్రజలు రూపాయి రూపాయి కూడబెట్టి బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ముతో కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆటలాడుతున్నది. ఈ సొమ్ముతో రుణ ఎగవేతదారుల జేబులు నింపుతున్నది. ఇప్పటికే తొమ్మిదేండ్లలో రూ.15 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేసి ప్రజల సొమ్మును ఫణంగా పెట్టి ఎగవేతదారుల కొమ్ముకాసిన మోదీ సర్కారు ఇప్పుడు మొత్తం బ్యాంకింగ్పైనే నమ్మకం కోల్పోయే నిర్ణయాలు తీసుకుంటున్నది. ఒకసారి రుణం తీసుకొని ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టిన వారికి మళ్లీ రుణాలు ఇచ్చేందుకు మార్గం సుగమం చేస్తున్నది. తద్వారా మళ్లీ మళ్లీ రుణా లు ఎగ్గొట్టేందుకు వారికి అవకాశం కల్పించబోతున్నది. ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టడమంటే మోసం చేసినట్టు. అలాంటి దొంగలకు సద్ది కట్టేలా బీజేపీ ప్రభుత్వ వ్యవహరిస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. ఇది ప్రమాదకర ధోరణి అని, బ్యాంకుల పట్ల ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితులు ఉత్పన్నమవుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మళ్లీ రుణాలు పొందేందుకు అర్హత
విల్ఫుల్ డిఫాల్టర్ల(ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు)తో కాంప్రమైజ్ సెటిల్మెంట్(రాజీ పరిష్కారం) చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఈనెల 8న బ్యాంకులకు ఒక సర్క్యూలర్ జారీ చేసింది. అంటే, ఉద్దేశపూర్వకంగా రుణం ఎగ్గొట్టిన వారు ఎంత ఇస్తే అంత కండ్లకు అద్దుకొని తీసుకొని ఊరుకోవాలనేది స్థూలంగా ఈ సర్యూలర్ చెబుతున్న మాట. ఉద్దేశపూర్వకంగా రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన వారిపై కఠిన చర్యలు చేపట్టి రుణాలు రికవరీ అయ్యేలా చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇలా ‘ఇచ్చింది తీసుకోండి.. రాజీ చేసుకోండి’ అంటూ చెప్పడం అందరినీ విస్మయానికి గురిచేసింది. బ్యాంకింగ్ ఉద్యోగులు కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఉద్దేశపూర్వక ఎగవేతదారులు ఒకసారి రుణం ఎగ్గొట్టిన తర్వాత మళ్లీ రుణం పొందేందుకు కూడా ఈ సర్యూలర్ అవకాశం కల్పిస్తున్నది. 2019 జూన్ 7న ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించి ఆర్బీఐ ఒక సర్క్యూలర్ ఇచ్చింది. దీని ప్రకారం.. ఎగవేతదారులు మళ్లీ రుణాలు పొందేందుకు(రుణాల పునర్వ్యవస్థీకరణ) అనర్హులు. కానీ, ఇప్పుడు ఈ నిర్ణయాన్ని తుంగలో తొక్కేలా తాజా సర్యూలర్ ఉన్నది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులు ఒకసారి కాంప్రమైజ్ సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత ప్రమోటర్లను మారిస్తే 12 నెలల తర్వాత మళ్లీ రుణాలను పొందే అవకాశం కల్పించేలా తాజా ఆర్బీఐ నిర్ణయం ఉన్నది. 12 నెలలు కాదు ఐదేండ్ల తర్వాత మళ్లీ రుణాలు ఇచ్చేలా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటున్నదనే ప్రచారం కూడా జరుగుతున్నది.
ప్రజల సొమ్ము దొంగలకు..
ఏడాది అయినా, ఐదేండ్ల తర్వాత అయినా.. ఒకసారి ఉద్దేశపూర్వకంగా, మోసపూరితంగా రుణాలు ఎగ్గొట్టి ప్రజల సొమ్మును కాజేసిన వారు మళ్లీ రుణాలు పొందేందుకు అవకాశం కల్పించడం అనేది కచ్చితంగా మధ్యతరగతి ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మును దొంగలకు ధారాదత్తం చేయడమే అవుతుంది. ప్రమోటర్లను మార్చుకోవడం అనేది ఏ మాత్రం పెద్ద పని కాదు. సులువుగా మార్చుకొని తమ వారిని ప్రమోటర్లుగా పెట్టుకొని మళ్లీ రుణాలను పొందుతారు. మధ్యతరగతి వర్గాల ప్రజలకు బ్యాంకులు అంటే ఒక విశ్వాసం. పిల్లల చదువులకనో, పెండ్లిళ్ల కోసమో, రిటైరయ్యాక ఆసరాగా ఉంటుందనే నమ్మకంతో బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటారు. ఇలా దేశంలో దాదాపు 220 కోట్ల బ్యాంకు ఖాతాల్లో రూ.170 లక్షల కోట్ల మేర ప్రజల సొమ్ము ఉన్నది. కేంద్రం తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలతో ఈ డబ్బు క్రమంగా మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉన్నది. బ్యాంకులపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం వమ్ము అవుతుంది. బలమైన భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉన్నది. ఇలా రుణాలు కట్టకపోతే రైటాఫ్లు చేసేసి చేతులు దులుపుకోవడం, ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగవేసినా మళ్లీ రుణాలు ఇవ్వడం ద్వారా మొండిబకాయిలు పెరిగిపోతాయని, రుణాలు ఎగ్గొట్టే వారి సంఖ్య పెరుగుతుందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.