సింగరేణి బొగ్గు ఉత్పత్తి లక్ష్యం
హైదరాబాద్, ఏప్రిల్ 3, (నమస్తే తెలంగాణ): సింగరేణి చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఆర్థిక సంవత్సరం(2021-2022)లో అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓవర్ బర్డెన్ తొలగింపు లక్ష్యాలను సాధించాలని సంస్థ చైర్మన్, ఎండీ శ్రీధర్ ఆదేశించారు. ఇందుకు ప్రతిరోజూ, ప్రతినెల నిర్దేశించుకున్న లక్ష్యాలను క్రమం తప్పకుండా సాధిస్తూ ముందుకు పోవాలని చెప్పారు. హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆయన సంస్థ డైరెక్టర్లు, 11 ఏరియాల జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మాట్లాడారు. సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా 700 లక్షల టన్నుల ఉత్పత్తి, రవాణా జరగాలని, 450 మిలియన్ క్యుబిక్ బీటర్ల ఓవర్ బర్డెన్ తీయాలని లక్ష్యాలను నిర్దేశించారు. కరోనాతో గతేడాది బొగ్గు ఉత్పత్తి, రవాణాలో వెనుకబడిపోయామని, ప్రస్తుతం కొత్త గనులు ప్రారంభించడం, కాంట్రాక్టులు ఖరారు కావడం, బొగ్గుకి డిమాండ్ పెరగడంతో పూర్తి అనుకూల పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా, టర్నోవర్, లాభాలు సాధించాలని చెప్పారు. ఉత్పత్తి లక్ష్యాల సాధనకు ఎటువంటి సమంజసమైన ప్రతిపాదనలు వచ్చినా నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. ఈ సమీక్షలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్)జె జే ఆల్విన్, అడ్వైజర్ మైనింగ్ డీఎన్ ప్రసాద్, అడ్వైజరీ ఫారెస్ట్రీ సురేంద్రపాండే, జీఎం కోఆర్టినేషన్, మార్కెటింగ్ సూర్యనారాయణ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
నూతన ఆవిష్కరణల కోసం జీఎమ్మార్ ఇన్నోవెక్స్