న్యూఢిల్లీ, ఆగస్టు 15: ప్రధాన మంత్రి పంద్రాగస్టు ప్రసంగం అభాసుపాలైంది. దేశ స్వాతంత్య్ర దినోత్సవం వేళ నరేంద్ర మోదీ.. గొప్పల కోసం చెప్పిన మాటలు సర్వత్రా విమర్శలకు దారితీశాయి. ఓవైపు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలనే పూర్తిస్థాయిలో అందించలేకపోతున్నది చూస్తూనే ఉన్నాం. ఇంకోవైపు దేశవ్యాప్తంగా 5జీ సేవలను అందరూ అందిపుచ్చుకోనే లేదు. మెజారిటీ టెలికం వినియోగదారులు ఇప్పటికీ 4జీనే వాడుకుంటున్నారు. ఇంకొందరైతే 2జీ, 3జీల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ 6జీ కలల్ని కంటున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారంతా ఇప్పుడు. మంగళవారం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఎర్రకోటపై నుంచి చేసిన ప్రసంగంలో.. దేశంలో త్వరలోనే 6జీ మొబైల్ సేవలు రాబోతున్నట్టు ప్రధాని మోదీ చెప్పారు. భారత్ 6జీ శకంలోకి అడుగు పెట్టబోయే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. ‘5జీ సేవల విస్తరణలో భారత్ ఇతర అన్ని దేశాల కంటే ముందున్నది. దేశంలోని 700లకుపైగా జిల్లాల్లో నేడు 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఇప్పుడు 6జీ వంతు. ఇప్పటికే 6జీ మొబైల్ సేవల వినియోగం కోసం ఓ టాస్క్ఫోర్స్ కూడా ఏర్పాటైంది’ అని చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడిది నవ్వులపాలైపోయింది.
మోదీ 6జీ ఏర్పాట్లు కార్పొరేట్లకే తప్ప.. దేశంలోని కామన్ పీపుల్కు ఇప్పుడైతే అవసరం లేదన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. మోదీ తన ప్రసంగంలో ఆయా దేశాలతో పోల్చితే ప్రస్తుతం భారత్లోనే మొబైల్ డాటా చార్జీలు చౌకగా ఉన్నాయన్నారు. అందరికీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. అయితే ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు భారతీయ టెలికం రంగంలో పోటీ అంతంతమాత్రమే. ఒకట్రెండు కంపెనీల చేతిలోనే భారతీయ టెలికం రంగం ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలోనే గతంతో పోల్చితే డాటా చార్జీలు ఏ స్థాయిలో పెరిగాయో సగటు వినియోగదారునికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో 6జీ ప్రయత్నాలు.. టెక్నాలజీపరంగా అభివృద్ధి మాటెలా ఉన్నా.. మొబైల్ యూజర్ల జేబులకు మాత్రం చిల్లులు పెట్టడం ఖాయమని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే టెలికం సంస్థలు బలవంతంగా కస్టమర్లను అప్గ్రేడ్ చేస్తున్నాయని, ఫ్రీక్వెన్సీలను తగ్గిస్తున్నారంటున్నారు. ఇక స్మార్ట్ఫోన్ల వినియోగకాలం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదని పేర్కొంటున్నారు. దీంతో ఈ నిర్ణయాలన్నీ టెలికం సేవలు, స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీల కోసమే కేంద్రం తీసుకుంటున్నదని మండిపడుతున్నారు. బీఎస్ఎన్ఎల్ను ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేస్తూ.. ప్రైవేట్ రంగ సంస్థలకు పట్టం కడుతున్నారని, స్పెక్ట్రం కేటాయింపులే ఇందుకు నిదర్శనమని ఉదహరిస్తున్నారు. మొత్తానికి ప్రజలచేత అవసరం లేకున్నా ఖర్చు చేయించి, కృత్రిమ వినియోగాన్ని సృష్టిస్తున్నారని, ఇది తాత్కాలికంగా దేశ జీడీపీకి వృద్ధిని కట్టబెట్టినా.. దీర్ఘకాలంలో తీవ్రమైన సంక్షోభానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.
5జీ తర్వాతి తరమే ఈ 6జీ. ఇంకా ఏ దేశంలోనూ 6జీ మొబైల్ సేవలు అందుబాటులో లేవు. ఒకవేళ 6జీ వస్తే.. ప్రస్తుతమున్న సూపర్ ఫాస్ట్ నెట్వర్క్ 5జీలో కంటే ఇంటర్నెట్ 100 రెట్లు వేగంగా నడుస్తుంది. 5జీలో సెకనుకు 10 గిగాబైట్ల వరకు ఇంటర్నెట్ స్పీడ్ ఉంటున్నది. అయితే 6జీలో సెకనుకు 1 టెరాబైట్ స్పీడ్ను అందుకోవచ్చంటున్నారు. ఇంకా చెప్పాలంటే 6జీ ఇంటర్నెట్ వేగంతో నిమిషానికి ఏకంగా 100 సినిమాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. భూమి మీదనేగాక ఆకాశయానంలోనూ మిక్కిలి సౌకర్యవంతమైన ఇంటర్నెట్ అనుభూతిని పొందవచ్చు. మరింత స్పష్టమైన విజన్తో వీడియోలు చూడవచ్చు. అయితే దీనికి తగ్గట్టుగానే ధరలూ పేలిపోతాయనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.