Gold Smuggling | దేశంలోకి బంగారం అక్రమ రవాణా అనునిత్యం పెరుగుతూనే ఉన్నది. ప్రభుత్వ గణాంకాలు కూడా ఈ అంశాన్ని ధృవీకరిస్తున్నాయి. గత రెండేండ్లలో కస్టమ్స్, ఇతర ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకున్న స్మగ్లింగ్ బంగారం 62.5 శాతం పెరిగింది. 2020లో 2,154.58 కిలోల స్మగుల్డ్ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకుంటే, 2022లో అది 3,502.16 కిలోలకు పెరిగింది. కేవలం ఈ ఏడాది ఒక్క జనవరిలోనే 384.71 కిలోల స్మగ్లింగ్ బంగారం కస్టమ్స్ అధికారులు జప్తు చేయడం గమనార్హం.
గత రెండేండ్లలో స్మగ్లింగ్ బంగారం తరలిస్తున్న వ్యక్తుల అరెస్ట్లు 23.11 శాతం పెరిగాయి. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు గత రెండు సంవత్సరాల్లో పట్టుకున్న బంగారం స్మగ్లింగ్ కేసులు 55.12 శాతం పెరిగాయని లోక్సభకు కేంద్ర ప్రభుత్వం సమర్పించిన గణాంకాలు చెబుతున్నాయి. 2020లో 2567 బంగారం స్మగ్లింగ్ కేసులు నమోదైతే, 2022లో 3982కి పెరిగింది. గత నెలలో 414 బంగారం స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి. గత రెండేండ్లలో బంగారం స్మగ్లింగ్ కేసుల్లో అరెస్టవుతున్న వారి సంఖ్య 23.11 శాతం పెరిగింది.
దేశీయ అవసరాల కోసం విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకోవాల్సిందే. కానీ, ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విధంగా మనదేశంలోనే బంగారం దిగుమతిపై సుంకం ఎక్కువ. జీఎస్టీ తదితర పన్నులతో కలిసి మొత్తం పన్నులు 18 శాతానికి చేరుకున్నాయని కెడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ కెడియా తెలిపారు. అందువల్లే రోజురోజుకు దేశంలో బంగారం స్మగ్లింగ్ పెరుగుతున్నదన్నారు.
బంగారం దిగుమతి సుంకం 10.75 నుంచి 15 శాతానికి పెంచుతూ గత జూలైలో కేంద్రం నిర్ణయం తీసుకున్నది. బంగారంపై బేసిక్ కస్టమ్ డ్యూటీ (బీసీడీ) 7.5 నుంచి 12.5 శాతానికి పెంచారు. ఏఐడీసీ యధాతథంగా 2.5 శాతంగా కొనసాగించారు. బడ్జెట్ ప్రతిపాదనల్లోనూ కస్టమ్స్ డ్యూటీ యధావిధిగా కొనసాగించారు. ముంబైలో బుధవారం పది గ్రాముల (24 క్యారట్లు) బంగారం ధర రూ.56,478 పలికింది.