IT Layoffs | భారతీయ ఐటీ రంగంలో సంక్షోభపు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న విపత్కర పరిస్థితులు, గ్లోబల్ ఎకానమీలో ఏర్పడ్డ అనిశ్చిత వాతావరణం దేశీయ ఐటీ సంస్థల ఆదాయానికి గండి కొడుతున్నాయి. వ్యయ నియంత్రణ చర్యల దిశగా ఇప్పుడు సంస్థలు అడుగులు వేస్తున్నాయి. అందుకే గత 6 నెలల్లో 52వేల ఉద్యోగాలు పోయాయి. గడిచిన 25 ఏండ్లలో ఇదే గరిష్ఠ స్థాయి. సమీప భవిష్యత్తులోనూ ఉద్యోగుల తొలగింపులుంటాయన్న సంకేతాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నది.
ముంబై/బెంగళూరు, అక్టోబర్ 30: దేశీయ ఐటీ కంపెనీల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతున్నాయి. భారతీయ టాప్-10 ఐటీ సంస్థల్లో తొమ్మిదింటిలో ఈ ఏడాది ఏప్రిల్ మొదలు సెప్టెంబర్ ఆఖరుదాకా ఏకంగా అర లక్షకుపైగా ఉద్యోగులు బయటకుపోయారు. ఆయా సంస్థలు వెల్లడించిన గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లో 51,744 కొలువులు పోయాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్, ఎంఫసిస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎల్టీఐమైండ్ట్రీల్లో ఈ ఏడాది మార్చి 31న 21.1 లక్షలకుపైగా ఉన్న ఉద్యోగుల సంఖ్య.. ఈ సెప్టెంబర్ 30కి 20.6 లక్షలకు క్షీణించింది. గడిచిన 25 ఏండ్లలో ఇదే గరిష్ఠమని డాటా అగ్రిగేటర్ వేదిక స్టాటిస్టా తాజాగా తెలియజేసింది.
గ్లోబల్ మార్కెట్ దెబ్బ
భారతీయ ఐటీ రంగానికి అంతర్జాతీయ వ్యాపారమే కీలకం. ఈ క్రమంలో అమెరికా, ఐరోపా తదితర గ్లోబల్ మార్కెట్లలో చోటుచేసుకున్న ప్రతికూల పరిస్థితులు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనం.. దేశీయ ఐటీ కంపెనీలను భారీగానే ప్రభావితం చేస్తున్నాయి. భారతీయ ఐటీ రంగానికి ఇదో పరీక్షా కాలం అని మెజారిటీ నిపుణులు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కాగా, దేశంలోని టాప్-10 ఐటీ కంపెనీల్లో ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ మినహా మిగతావన్నీ ఉద్యోగుల్ని తగ్గించేశాయి. ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ సైతం 32 మందినే ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఉద్యోగాల్లోకి తీసుకున్నది. అయితే సంస్థ ఉద్యోగుల సంఖ్య ఎప్పుడూ లేనివిధంగా 22,265కి చేరింది.
ఫ్రెషర్స్కు గడ్డుకాలం
ఐటీ రంగంలో స్థిరపడాలనుకునేవారికి గడ్డుకాలమే నడుస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. గ్లోబల్ కస్టమర్లు, ముఖ్యంగా పశ్చిమ దేశాల నుంచి ఆర్డర్లు గణనీయంగా తగ్గిపోవడం.. భారతీయ ఐటీ సంస్థల ఆదాయాన్ని దిగజార్చుతున్నదని పేర్కొంటున్నారు. నిజానికి గత ఆర్థిక సంవత్సరం (2022-23) వరకు పరిస్థితులు బాగానే ఉన్నా.. ఈ ఏడాది నుంచే ప్రతికూలంగా మారాయని అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇప్పుడప్పుడే క్యాంపస్ రిక్రూట్మెంట్లనూ ఆశించలేమని వ్యాఖ్యానిస్తున్నారు. ఆయా దిగ్గజ ఐటీ కంపెనీలూ ఇదే సంకేతాల్ని ఇస్తుండటం గమనార్హం. మొత్తానికి దేశీయ ఐటీ రంగంలో ఈ రకమైన వాతావరణం ఎక్కువకాలం కొనసాగితే నిరుద్యోగం రేటు పెరగక తప్పదన్న హెచ్చరికలూ నిపుణుల నుంచి వస్తున్నాయి.
ఈ సెప్టెంబర్ 30 నాటికి ఏ సంస్థలో ఎంతమంది?
సంస్థ : ఉద్యోగులు
టీసీఎస్ : 6,06,985
కాగ్నిజెంట్ : 3,45,600
ఇన్ఫోసిస్ : 3,28,764
విప్రో : 2,44,707
హెచ్సీఎల్ టెక్ : 2,21,139
టెక్ మహీంద్రా : 1,50,604
ఎల్టీఐమైండ్ట్రీ : 85,532
ఎంఫసిస్ : 33,771
పర్సిస్టెంట్ సిస్టమ్స్ : 22,842
ఎల్అండ్టీ టెక్నాలజీ : 22,265
దేశీయ ఐటీ రంగంలో డిమాండ్ బలహీనంగా ఉన్నది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో స్థిరత్వం ఏర్పడేదాకా భారతీయ ఐటీ సెగ్మెంట్లో ఒడిదుడుకులు తప్పవు. భవిష్యత్తు ఇబ్బందికరంగా ఉంటుందన్న అంచనాల మధ్య చాలా దేశాల్లోని ఐటీ కస్టమర్లు పొదుపు దిశగా అడుగులు వేస్తున్నారు. వ్యయ నియంత్రణ చర్యలు పాటించి తమ వద్ద ఉండే నగదు నిల్వల్ని కా పాడుకునే ప్రయత్నాన్ని ఆయా కంపెనీలు చేస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, గాజాపై ఇజ్రాయెల్ దాడులూ ఓ కారణమే.
-కే కృతీవాసన్, టీసీఎస్ సీఈవో
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో క్యాంపస్ రిక్రూట్మెంట్లు లేనట్టే. పరిస్థితులు ఎంతమాత్రం అనుకూలంగా లేవు. అయినప్పటికీ ప్రతీ త్రైమాసికంలో అవకాశాల్ని అంచనా వేస్తూ ముందుకెళ్తాం. భారతీయ ఐటీ రంగ సంస్థలకు విదేశాల నుంచి వచ్చే ఆర్డర్లే ప్రధాన ఆదాయ వనరు. కానీ ఇప్పుడీ ఆర్డర్లు చాలావరకు తగ్గిపోయాయి. ఆయా దేశాల్లో, అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఇబ్బందికర వాతావరణమే ఇందుకు కారణం. దీంతో దేశీయ ఐటీ కంపెనీల వ్యాపారం పడిపోయింది. దాని ఫలితమే ఉద్యోగుల సంఖ్య లో ఈ తగ్గింపులు. ఫ్రెషర్స్కు నిజంగా ఈ పరిణామాలు మింగుడుపడనివే.
-నిరంజన్ రాయ్, ఇన్ఫోసిస్ సీఎఫ్వో
కొత్త నియామకాలకు వెళ్లే ముందు ఇప్పటికే ఆఫర్ ఇచ్చిన ఉద్యోగులను పనిలోకి తీసుకోవాలని చూస్తున్నాం. అప్పటిదాకా ఎటువంటి న్యూ రిక్రూట్మెంట్స్ ఉండబోవు. మార్కెట్లో ప్రతికూల పరిస్థితులున్నాయి. అయినప్పటికీ గతంలో తమ సంస్థ ద్వారా ఉద్యోగావకాశాల్ని అందిపుచ్చుకున్నవారిని దూరం చేసుకోబోము. వెయిటింగ్ లిస్టులో ఉన్నవారికి రాబోయే త్రైమాసికాల్లో ప్లేస్మెంట్ ఇచ్చేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నాం.
-సౌరభ్ గోవిల్,విప్రో సీహెచ్ఆర్వో