Nirmala on GST | రాష్ట్ర ప్రభుత్వాల ఏకాభిప్రాయంతోనే తృణ ధాన్యాలతోపాటు పప్పు దినుసులు సహా ప్రీ ప్యాక్డ్ ఆహార ధాన్యాలపై జీఎస్టీ విధించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆహార ఉత్పత్తులపై పన్ను విధించడం ఇదే తొలిసారి కాదని పేర్కొంటూ మంగళవారం ట్వీట్ల వర్షం కురిపించారు. సోమవారం నుంచి ఆహార ఉత్పత్తులపై ఐదు శాతం జీఎస్టీ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతుండటంతో నిర్మలా సీతారామన్ స్పందించారు. పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు ( To Curb Tax Leakage ) అడ్డుకట్ట వేసేందుకు ప్రీ ప్యాక్డ్ ఫుడ్ మెటీరియల్పై పన్ను విధించామని తెలిపారు.
ప్రీ-జీఎస్టీ హయాంకు ముందు ఆహార ధాన్యాలపై రాష్ట్రాలు వాల్యూ యాడెడ్ టాక్స్ (వ్యాట్) వసూలు చేశాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. `ఆహార ఉత్పత్తులపై పన్ను వసూలు చేయడం ఇదే తొలిసారా? కాదు. జీఎస్టీ విధానం అమల్లోకి రాకముందు రాష్ట్రాలు గణనీయంగా పన్ను వసూలు చేసుకుని ఆదాయం పొందాయి. ఆహార ధాన్యాల కొనుగోలుపై పంజాబ్ రూ.2000 కోట్లు, ఉత్తరప్రదేశ్ రూ.700 కోట్ల ఆదాయం పొందాయి` అని ట్వీట్ చేశారు.
ప్రీ-ప్యాక్డ్, ప్రీలేబుల్డ్ ఆహార వస్తువులపై ఐదు శాతం జీఎస్టీ విధించాలన్న జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయంపై వ్యాపారులు, వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని హోల్సేల్ గెయిన్ మార్కెట్లు ఈ నెల 16న మార్కెట్లు మూసేసి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ స్పందించారు. గత నెల 28న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.