న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: మ్యూచువల్ ఫండ్స్లో మదుపుచేసే ఇన్వెస్టర్ల సంఖ్య జోరుగా పెరుగుతున్నది. ఈ మదుపు సాధనం పట్ల అవగాహన పెరగడం, డిజిటలైజేషన్తో లావాదేవీలు సులభతరంకావడంతో ఫండ్స్ మదుపుదారులను ఆకర్షించగలుగుతున్నాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫి) తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది జనవరిలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు కొత్తగా 46.7 లక్షల ఇన్వెస్టర్ల ఖాతాలు జతయ్యాయి.
ఏడాది క్రితం సగటున నెలకు 22.3 లక్షల ఫోలియోలు జతకాగా, ఈ జనవరిలో అంతకు రెట్టింపు తెరవడం గమనార్హం. కొత్తగా తెరిచిన ఖాతాలతో మొత్తం మ్యూచువల్ ఫండ్స్ ఫోలియోలు 16.96 కోట్లకు చేరాయి. 2023 జనవరి ముగింపునాటికి మొత్తం ఫోలియోల సంఖ్య 14.28 కోట్లుకాగా, అవి ప్రస్తుతం 19 శాతం వృద్ధిచెందాయి. 2023 డిసెంబర్లో 16.49 కోట్ల ఫోలియో నంబర్ల నుంచి 3 శాతం పెరిగాయి.
వ్యక్తిగత ఇన్వెస్టర్ల ఖాతాలకు డిజిగ్నేట్ చేసేవే ఫోలియో నంబర్లు. ఒకే ఇన్వెస్టరు ఎన్ని ఫోలియోలైనా తెరవవచ్చు. ఆర్థిక ఆక్షరాస్యత పెరుగుదల, అధిక ఆదాయాలు, డిజిటైజేషన్ విస్త్రతితో దేశంలో ఇన్వెస్టర్లు సాంప్రదాయ పొదుపు సాధనాలైన ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్స్కంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులకు మొగ్గు చూపిస్తున్నారని వైట్వోక్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ప్రతీక్ పంత్ చెప్పారు.
నవతరం నేతృత్వం
కొద్ది సంవత్సరాలుగా పెరుగుతున్న మ్యూచువల్ ఫండ్ ఫోలియోలకు కొత్త తరం జెన్-వై, జెన్-జడ్ ఇన్వెస్టర్లు నేతృత్వం వహిస్తున్నారు. 1981-1996 మధ్య జన్మించినవారు మిల్లెనియల్స్ (జెనరేషన్-వై ఇన్వెస్టర్లు)కాగా, 19997-2012 మధ్య పుట్టినవారిని జెన్-జడ్గా వ్యవహరిస్తుంటారు. కొత్త ఇన్వెస్టర్లలో అధికశాతం మ్యూచువల్ ఫండ్స్లోకి డిజిటల్ చానళ్ల ద్వారా ప్రవేశిస్తున్నారని పంత్ వెల్లడించారు.
జనవరిలో వచ్చిన 46 లక్షల ఫోలియోల్లో 34.7 లక్షల ఫోలియోలు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్వే. మొత్తం ఫండ్ ఖాతాల్లో ఈక్విటీ ఫోలియోలు 11.68 కోట్లకు (69 శాతం వాటా) చేరినట్టు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది. డెట్ మ్యూచువల్ ఫండ్స్కంటే ఈక్విటీలపైనే మదుపుదారుల ఆసక్తి అధికంగా ఉందనడానికి ఇది నిదర్శనమని ఫండ్ విశ్లేషకులు చెప్పారు. 2024 జనవరిలో హైబ్రీడ్ ఫండ్స్ (డెట్, ఈక్విటీలు రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేసేవి) 3.36 లక్షల ఫోలియోలు జతచేసుకోవడంతో వాటి మొత్తం ఫోలియోల సంఖ్య 1.31 కోట్లకు పెరిగాయి.
మరోవైపు డెట్ స్కీమ్ల్లో ఫోలియోల సంఖ్య వరుసగా ఐదో నెలలోనూ తగ్గింది. వీటి మొత్తం సంఖ్య 74.66 లక్షలకు పరిమితమయ్యింది. ఫోలియోల సంఖ్య కొద్ది సంవత్సరాల నుంచి ఎంతగా పెరిగినప్పటికీ, దేశంలో ఫండ్స్లో పెట్టేవారు చాలా తక్కువేనని పరిశ్రమ విశ్లేషకులు పేర్కొంటున్నారు. భారత జనాభాలో మ్యూచువల్ ఫండ్ మదుపుదారులు 3 శాతంలోపేనని వారు గుర్తుచేశారు. ప్రస్తుత దేశీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలో రూ.53 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి.