న్యూఢిల్లీ, జనవరి 31: కొత్తగా ఏర్పాటైన 16వ ఆర్థిక సంఘంలో నలుగురు సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమించింది. నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అర్వింద్ పనగరియా నేతృత్వంలో వచ్చిన ఈ ఫైనాన్స్ కమిషన్లో సభ్యులుగా మాజీ వ్యయ కార్యదర్శి అజయ్ నారాయణ్ ఝా, ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్, రిటైర్డ్ బ్యూరోక్రాట్ అన్నీ జార్జ్ మాథ్యూ, అర్థ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిరంజన్ రాజాధ్యక్షలను ఎంపిక చేసింది.
ఇందులో అజయ్ నారాయణ్ ఝా 15వ ఆర్థిక సంఘంలోనూ సభ్యుడిగా ఉన్నారు. కాగా, అజయ్, జార్జ్, నిరంజన్లు కమిషన్లో పూర్తిస్థాయి సభ్యులుగా ఉండనుండగా, సౌమ్య మాత్రం పార్ట్-టైం మెంబర్గా ఉంటారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. గత ఏడాది డిసెంబర్ 31న ఏర్పాటైన ఈ కమిషన్.. 2025 అక్టోబర్ 31కల్లా తమ రిపోర్టును సమర్పించాల్సి ఉన్నది. 2026 ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఐదేండ్ల కోసం ఇది సిద్ధమవుతున్నది.