Air Passengers | ముంబై, మార్చి 6: దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులు అంతకంతకు పెరుగుతున్నారు. ఈ నెలాఖరుకల్లా 15-15.5 కోట్ల మందికి చేరుకునే అవకాశం ఉన్నదని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తున్నది. కరోనా కంటే ముందు ఏడాది 14.12 కోట్ల మంది ప్రయాణించారు. దేశీయ విమానయాన రంగం నిలకడైన వృద్ధిని సాధించనున్నదని, ముఖ్యంగా దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు పెరగడం ఇందుకు కారణమని విశ్లేషించింది.
విమాన ఇంధన ధరలు తగ్గుముఖం పట్టడం, విదేశీ మారకం రేట్లు యథాతథంగా ఉండటం విమానయాన సంస్థలకు లాభం చేకూరుతున్నదని ఇక్రా వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్-ఫిబ్రవరిలో సరాసరిగా కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ.1,03,547కి తగ్గింది. ఏడాది క్రితం ఇదే సమయంలో రూ.1,20,978గా ఉన్నది. అయినప్పటికీ 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.64,715 కంటే 60 శాతం అధికం. విమానయాన సంస్థల నిర్వహణలో 30-40 శాతం ఇంధన ఖర్చులే.