ప్రభుత్వ రంగంలోని పలు సంస్థలను ప్రైవేటు రంగానికి ధారాదత్తం చేసే ప్రక్రియను నరేంద్ర మోదీ సర్కార్ వేగవంతం చేసింది. ప్రైవేటీకరణ కోసం నీతి ఆయోగ్ 12 పీఎస్యూలతో రూపొందించిన తొలి జాబితాను కేంద్రానికి సమర్పించింది. వీటిలో ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)లు, బీమా కంపెనీలతోపాటు కీలక రంగాలకు చెందిన పీఎస్యూలు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ జాబితాపై డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం), పెట్టుబడుల ఉపసంహరణ కోసం కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన సీజీడీ (కోర్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్) సమీక్ష జరిపి తన సూచనలను ఆల్టర్నేటివ్ మెకానిజమ్ (ఏఎం)కు పంపుతుంది. ఈ సూచనలను ఏఎం, దీపం ఆమోదించిన తర్వాత ప్రాథమిక అనుమతి కోసం పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ)కి పంపుతారు. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో పీఎస్యూల నుంచి రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించాలన్న లక్ష్యం దిశగా కేంద్రం ముందుకు సాగేందుకు మార్గం సుగమమవుతుంది.
న్యూఢిల్లీ, మార్చి 12: ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)లను ప్రైవేటీకరించే ప్రక్రియ వేగవంతమవుతున్నది. ప్రైవేటు రంగానికి దారాదత్తం చేయాల్సిన దాదాపు డజను పీఎస్యూలతో రూపొందించిన తొలి జాబితాను నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. దీనిలో ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)లు, బీమా కంపెనీలతోపాటు కీలక రంగాలకు చెందిన పీఎస్యూలు కూడా ఉన్నాయి. ఈ జాబితాపై డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం), పెట్టుబడుల ఉపసంహరణ కోసం కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన సీజీడీ (కోర్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్) సమీక్ష జరుపనున్నట్లు సమాచారం.
నీతి ఆయోగ్ సిఫారసులను పరిశీలించాక సీజీడీ తన సూచనలను ఆర్థిక, రోడ్లు, రవాణా, రహదారులు, పాలనా సంస్కరణలకు సంబంధించిన మంత్రులతో కూడిన ఆల్టర్నేటివ్ మెకానిజమ్ (ఏఎం)కు పంపుతుంది. ఈ సూచనలను ఏఎం, దీపం ఆమోదించిన తర్వాత ప్రాథమిక అనుమతి కోసం పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన ఆర్థిక వ్యవహరాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ)కి పంపుతారు. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో పీఎస్యూల నుంచి రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించాలన్న లక్ష్యం దిశగా కేంద్రం ముందుకు సాగేందుకు మార్గం సుగమమవుతుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు ఓ సాధారణ బీమా కంపెనీని ప్రైవేటీకరించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల సార్వత్రిక బడ్జెట్ ప్రతిపాదన సందర్భంగా ప్రకటించిన విషయం విదితమే. వీటితోపాటు ఇతర సంస్థల్లో విలీనం చేయాల్సిన, ప్రైవేటీకరించాల్సిన లేదా ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు అనుబంధ సంస్థలుగా మార్చాల్సిన కీలక రంగాల్లోని పీఎస్యూల పేర్లను సూచించే బాధ్యతను నీతి ఆయోగ్కు కేంద్రం అప్పగించింది.
విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, ఇతర ఖనిజాలు, అణు శక్తి, ఖగోళ, రక్షణ, బ్యాంకింగ్, బీమా, ఆర్థిక సేవలు, రవాణా, టెలీకమ్యూనికేషన్ల లాంటి కీలక రంగాలకు చెందిన సంస్థల నిర్వహణలో పరిమిత పాత్ర పోషించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ), ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) లాంటి స్వయం ప్రతిపత్తి సంస్థలతోపాటు రెగ్యులేటరీ (నియంత్రణ) సంస్థలు, డెవలప్మెంట్ ఫైనాన్సింగ్ సంస్థలను ప్రైవేటీకరణకు దూరంగా ఉంచిన కేంద్ర ప్రభుత్వం.. ఉక్కు, ఆతిథ్యం లాంటి కీలకేతర రంగాల్లోని పీఎస్యూలను ప్రైవేటీకరించేందుకు లేదంటే మూసివేసేందుకు కసరత్తు చేస్తున్నది.
ప్రభుత్వ రంగంలోని పలు సంస్థలు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. వాటిని అలాగే నడపడం దేశ ఆర్థిక వ్యవస్థకు పెను భారమే. పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో వాటిని నడపాల్సిన అవసరం లేదు. వారసత్వంగా వస్తున్నాయనో, చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాయనో, కొందరి కలల ప్రాజెక్టులనే కారణాలతోనో లేక ఇతర సెంటిమెంట్లతోనో పీఎస్యూలను కొనసాగించరాదు. వ్యాపార వ్యవహారాల్లో ప్రభుత్వం భాగస్వామిగా ఉండకూడదు. నాలుగు వ్యూహాత్మక రంగాలు (అణు శక్తి-ఖగోళ, రక్షణ, రవాణా-టెలీకమ్యూనికేషన్లు, విద్యుత్-పెట్రోలియం-బొగ్గు-ఇతర ఖనిజాలు, బ్యాంకింగ్-బీమా-ఆర్థిక సేవలు) మినహా మిగిలిన అన్ని రంగాల్లోని పీఎస్యూలను ప్రైవేటీకరించి తీరుతాం.
– నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
‘వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల అమ్మకం ద్వారా రూ.1.75 లక్షల కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఐడీబీఐ బ్యాంక్, బీపీసీఎల్, షిప్పింగ్ కార్పొరేషన్, కంటైనర్ కార్పొరేషన్, నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, పవన్ హన్స్, ఎయిర్ ఇండియా తదితర సంస్థల వ్యూహాత్మక విక్రయం ఉంటుంది. ఎల్ఐసీ ఐపీవో కోసం ప్రస్తుత చట్టాలనూ సవరిస్తాం. నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా మిగతా రంగాల్లోని ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తాం. ఇందుకు సంబంధించి జాబితాను సిద్ధం చేయాలని ఇప్పటికే నీతి ఆయోగ్కు సూచించాం’
– బడ్జెట్ ప్రతిపాదన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్