ముంబై, ఏప్రిల్ 2: గత నెలాఖరుతో ముగిసిన గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24)లో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి భారీగానే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు (ఐపీవో) వచ్చాయి. అయితే ఇందులో కొన్ని ఆకర్షణీయ స్థాయిలో మదుపరులకు రాబడులను అందించాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మొత్తం 78 ఐపీవోల్లో గత ఆర్థిక సంవత్సరం 100 శాతానికిపైగా లాభాలను 13 ఇచ్చాయి. వీటిలో ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ (ఐఆర్ఈడీఏ) గరిష్ఠంగా 325 శాతం లాభాలను ఇన్వెస్టర్లకు పంచింది. 104.1 శాతంతో టాటా టెక్నాలజీస్ దిగువన నిలిచింది.
ఎల్ఐసీ తర్వాత..
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) కంపెనీ తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్ఈడీఏనే. నిరుడు నవంబర్ 29న రూ.32 వద్ద ఈ సంస్థ షేర్లు మార్కెట్లలో నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరానికిగాను ట్రేడింగ్ చివరి రోజైన మార్చి 28న రూ.135.9 వద్ద ముగిసింది. దీంతో 324.7 శాతం రిటర్న్స్ వచ్చాయి. ఐఆర్ఈడీఏ పబ్లిక్ ఇష్యూ పరిమాణం రూ.2,150.21 కోట్లుగా ఉన్న విషయం తెలిసిందే.
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
వరుస 3 రోజుల లాభాలకు బ్రేక్ పడింది. మంగళవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 110.64 పాయింట్లు లేదా 0.15 శాతం క్షీణించి 73,903.91 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 270.78 పాయింట్లు పతనం కావడం గమనార్హం. అయితే ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ స్వల్పంగా 8.70 పాయింట్లు లేదా 0.04 శాతం తగ్గి 22,453.30 వద్ద స్థిరపడింది. ఐటీ, ప్రైవేట్ బ్యాంక్, ఆటో రంగాల షేర్లలో మదుపరులు లాభాల స్వీకరణకు దిగడమే సెన్సెక్స్ నష్టాలకు కారణం.
అమెరికా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడుల ఉపసంహరణ కూడా అమ్మకాల ఒత్తిడికి దారితీసిందన్న విశ్లేషణలున్నాయి. కాగా, సోమవారం ట్రేడింగ్లో అటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీ రెండూ ఆల్టైమ్ హైని తాకిన సంగతి విదితమే. అయితే మదుపరుల లాభాల స్వీకరణతో ఆ రికార్డు ఆఖరుదాకా నిలవలేకపోయింది. ఇదిలావుంటే టెక్నాలజీ, ఐటీ, టెలికం, బ్యాంకింగ్ సూచీలు 0.71 శాతం నుంచి 0.19 శాతం వరకు కోల్పోయాయి. కొటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, ఎల్అండ్టీ షేర్లు భారీగా నష్టపోయాయి.