ప్రభుత్వానికి ప్రతిపాదనలు: సింగరేణి సీఎండీ శ్రీధర్
హైదరాబాద్, జనవరి 3 : ఇప్పటికే 219 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్లను నిర్వహిస్తున్న నేపథ్యంలో మరో 1000 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు యోచిస్తున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని సోలార్ విభాగం ఉన్నతాధికారులను సీఎండీ ఆదేశించారు. గురువారం సింగరేణి భవన్లో థర్మల్, సోలార్ప్రాజెక్టులపై సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. దేశంలో బొగ్గు ఉత్పత్తితోపాటు సోలార్, థర్మల్ విద్యుత్తు రంగాల్లోకి అడుగుపెట్టిన తొలి ప్రభుత్వ బొగ్గు ఉత్పత్తి సంస్థగా సింగరేణి ఖ్యాతికెక్కిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుతించిన తరువాత.. రాష్ట్ర వ్యాప్తంగా నిరుపయోగ, ఖాళీ స్థలాల్లో 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్నారు.
విద్యుత్తు ఉత్పత్తితో లాభాల పంట..
సింగరేణిలో ఏర్పాటు చేసిన 219 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల నుంచి ఇప్పటి వరకు 21.29 కోట్ల యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అయ్యిందని, తద్వారా సింగరేణి విద్యుత్తు ఖర్చులో రూ. 65.27 కోట్లమేర ఆదా అయినట్టు సీఎండీ తెలిపారు. అలాగే సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం ద్వారా గడిచిన 5 నెలల కాలంలో 90 శాతానికిపైగా పీఎల్ఎఫ్ సాధిస్తూ.. దేశంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు. థర్మల్ విద్యుత్తు కేంద్రం గడిచిన 10 నెలల్లో 7737 మిలియన్యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసిందని, తద్వారా రూ. 500 కోట్లకుపైగా లాభాలను ఆర్జించిందన్నారు.