న్యూఢిల్లీ, ఆగస్టు 4: కేంద్ర ప్రభుత్వ అనవసర జోక్యం.. మితిమీరిన ద్రవ్యోల్బణం.. కొన్ని వస్తూత్పత్తులకు పెరిగిన డిమాండ్.. దేశ వాణిజ్య లోటును ఎగదోస్తున్నాయి. ఫలితంగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) తొలి నాలుగు నెలల్లో (ఏప్రిల్-జూలై) వాణిజ్య లోటు 100 బిలియన్ డాలర్లను తాకింది. ముఖ్యంగా గత నెల జూలైలో భారత వాణిజ్య లోటు పెరగడానికి ప్రధాన కారణం.. దిగుమతులు భారీగా ఉన్నప్పటికీ ప్రభుత్వ జోక్యంతో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల నుంచి 31 శాతం పడిపోయిన ఆదాయమే. పెట్రోల్, డీజిల్పై విధించిన ఎగుమతుల సెస్సు.. ఖజానా ఆదాయాన్ని భారీగా గండికొట్టింది. ప్రభుత్వ నిర్ణయంతో ఈ ఏడాది జూన్లో 7.83 బిలియన్ డాలర్లుగా ఉన్న పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల ఆదాయం.. ఒక్కసారిగా జూలైలో 2.4 బిలియన్ డాలర్లకు క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుముఖం పట్టిన ముడి చమురు ధరలు.. అమెరికా, చైనా ఆర్థిక వృద్ధిరేటుపై ఆందోళనలు పరిస్థితిని మరింతగా దిగజార్చాయి.
పెట్రో ఉత్పత్తుల ఎగుమతులతోపాటు భారత్ నుంచి ఆయా దేశాలకు వెళ్లే రత్నాలు-ఆభరణాలు, ఆర్గానిక్-ఇన్ఆర్గానిక్ రసాయనాలు, రెడిమేడ్ దుస్తుల ఎగుమతులు సైతం పడిపోయాయి. జూలైలో 2.7 బిలియన్ డాలర్లకే ఇవి పరిమితమయ్యాయి. అమెరికా, హాంకాంగ్ వంటి పలు ప్రధాన మార్కెట్లలో డిమాండ్ తగ్గిపోవడం దేశీయ రత్నాలు, ఆభరణాల ఎగుమతుల్ని ప్రభావితం చేశాయి. భారత్ నుంచి అమెరికాకు ఎక్కువగా సాధారణ బంగారు, రత్నాభరణాలు ఎగుమతి అవుతాయి. రెడిమేడ్ దుస్తులు కూడా అమెరికాకు బాగానే పోతాయి. అయితే అగ్రరాజ్యంలోని మాంద్యం పరిస్థితులు మరికొన్ని నెలలపాటు భారతీయ ఎగుమతుల్ని ఇబ్బందే పెట్టనున్నాయన్న అంచనాలున్నాయి. ఇదే జరిగితే వాణిజ్య లోటు మున్ముందు మరింత తీవ్రతరమే కానున్నది.
ఓవైపు దేశ ఎగుమతులు తగ్గుతూపోతుంటే.. మరోవైపు దిగుమతులు పెరుగుతూపోతున్నాయి. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు ఎగుమతులకు మరిన్ని అవరోధాలు సృష్టిస్తున్నాయి. ఫలితంగా వాణిజ్య లోటుకు కళ్లెం వేయలేని దుస్థితి ఏర్పడింది. నిరుడు జూలైతో పోల్చితే ఈసారి దిగుమతులు 43.59 శాతం ఎగిశాయి. ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ గూడ్స్, మెషినరీ ఉత్పత్తుల దిగుమతుల విలువ భారీగా నమోదవుతున్నది. ముడి చమురు, పెట్రోలియం, బంగారం దిగుమతులు ఎలాగూ ఉండనే ఉన్నాయి. మొత్తానికి దేశీయ అవసరాలను సొంతంగా తీర్చుకుంటూ, ఎగుమతులకు పెద్దపీట వేస్తేనే వాణిజ్య లోటును కట్టడి చేయగలమని నిపుణులు చెప్తున్నారు. కేంద్రం ఈ దిశగా అడుగేయాలని సూచిస్తున్నారు.