న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ మధ్య కేంద్ర ప్రభుత్వ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.10.64 లక్షల కోట్ల కు చేరాయి. గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే ఇవి 23.4 శాతం అధికం. పూర్తి సంవత్సరానికి బడ్జెట్లో ప్రతిపాదించిన అంచనాల్లో ఈ 8 నెలల్లో వసూళ్లు 58.34 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఏప్రిల్-నవంబర్ మధ్యకాలంలో రిఫండ్స్ జరపకముందు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 17.7 శాతం వృద్ధితో రూ.12.67 కోట్లకు చేరగా, రూ.2.03 లక్షల కోట్ల పన్ను రిఫండ్స్ చేసినట్టు వివరించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.18.23 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు (వ్యక్తిగత ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను), రూ.15.38 లక్షల కోట్ల పరోక్ష పన్ను వసూళ్లను (జీఎస్టీ, కస్టమ్స్, ఎక్స్యిజ్) బడ్జెట్లో అంచనా వేశారు. మొత్తం రూ.33.61 లక్షల కోట్ల పన్ను వసూళ్ల లక్ష్యానికే ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక శాఖ అధికారి తెలిపారు.