న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: దేశంలో మరణ మృదంగం మోగిస్తున్న కరోనా మహమ్మారి.. ఆర్థిక వ్యవస్థనూ మరోసారి కబళించేస్తున్నది. వైరస్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్లు, రాత్రి కర్ఫ్యూలకు దిగుతున్నాయి. ఇది వ్యాపార, పారిశ్రామిక రంగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఆర్థిక నష్టాన్ని రూ.1.5 లక్షల కోట్లుగా ఎస్బీఐ ఆర్థిక విభాగం నిపుణులు అంచనా వేశారు. ఇందులో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ల వాటానే 80 శాతం ఉండగా, కేవలం మహారాష్ట్రలో నెలకొన్న పరిస్థితుల విలువే 54 శాతమని తమ తాజా నివేదికలో ఎస్బీఐ గ్రూప్ ప్రధాన ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కూలీల వలసలు ఆర్థిక పరిస్థితుల్ని మరింత దిగజార్చే వీలుందని ఎస్బీఐ అభిప్రాయపడింది. కీలక రంగాల్లో కార్మికుల కొరత ఏర్పడవచ్చని, ఇది ఉత్పత్తిని ప్రభావితం చేయవచ్చన్నది. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లిపోయారు. మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్, బెంగాల్, బీహార్, అస్సోం, ఒడిషాలకు 4 లక్షల 32వేల మంది వెళ్లినట్లు రైల్వే వర్గాల సమాచారం. దీంతో దేశ వాణిజ్య రాజధానికి మున్ముందు మరిన్ని నష్టాలేనని ఎస్బీఐ హెచ్చరించింది.
కరోనా ఆంక్షలు రవాణా రంగాన్ని కుదిపేస్తున్నాయి. ట్రాన్స్పోర్టర్లకు రోజుకు దాదాపు రూ.1,000 కోట్ల నష్టం వాటిల్లుతున్నదని ట్రక్కర్ల సంఘం ఏఐఎంటీసీ తెలిపింది. ఆయా రాష్ర్టాల్లో లాక్డౌన్లు, పాక్షిక లాక్డౌన్లు, కర్ఫ్యూల కారణంగా రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతున్నదని వెల్లడించింది. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే నష్టాలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసింది.
రాష్ట్రం జీఎస్డీపీ ఆంక్షలు నష్టం
(కోట్లలో)
మహారాష్ట్ర 29.8% ఈ నెలాఖరుదాకా లాక్డౌన్ 81,672
మధ్యప్రదేశ్ 11.3% 15 జిల్లాల్లో లాక్డౌన్ 21,712
రాజస్థాన్ 12% మే 3 వరకు లాక్డౌన్ 17,237
చత్తీస్గఢ్ 3.8% 20 జిల్లాల్లో లాక్డౌన్ 7,347
బీహార్ 7.6% నైట్ కర్ఫ్యూ/పాక్షిక లాక్డౌన్ 6,222