వరుసగా మూడువారాల పాటు ర్యాలీ జరిపిన మార్కెట్ ముగిసినవారంలో కరెక్షన్కు లోనయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 204 పాయింట్లు క్షీణించి 17,624 వద్ద నిలిచింది. అమెరికా నుంచి వెలువడుతున్న జాబ్స్, ద్రవ్యోల్బణం గణాంకాలు.. ఫెడ్ వడ్డీ రేట్ల బాటపై ఇన్వెస్టర్లలో ఆయోమయాన్ని సృష్టించడంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్స్, బాండ్లు, బంగారం స్వల్ప శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. మే 3నాటి ఫెడ్ కమిటీ సమావేశం తర్వాత నిర్దేశిత ట్రెండ్ ఏర్పడవచ్చని విశ్లేషకులు చెపుతున్నారు. అప్పటివరకూ స్టాక్ సూచీలు పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనుకావచ్చని వారు అంచనా వేశారు. ఏప్రిల్ డెరివేటివ్ కాంట్రాక్టులు ఈ వారం ముగియనున్నందున, మన మార్కెట్లో ఒడిదుడుకులు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
నిఫ్టీ 17,500 స్థాయిని కోల్పోకపోతే ట్రెండ్ బుల్లిష్గానే ఉంటుందని ఎల్కేపీ సెక్యూరిటీస్ టెక్నికల్ అనలిస్ట్ కునాల్ షా చెప్పారు. 17,800 అవరోధాన్ని దాటితే 18,00-18,200 వరకూ పెరగవచ్చని అంచనా వేశారు. 200 డీఎంఏ, 40 డీఎంఏ రేఖలు కదులుతున్న 17,600-17,500 మద్దతు ఇవ్వవచ్చని, 17,860 అధిగమించేంతవరకూ కన్సాలిడేషన్ జరగవచ్చని బీఎన్పీ పారిబా టెక్నికల్ అనలిస్ట్ జతిన్ వివరించారు. ఈ వారం నిఫ్టీ 17,550 స్థాయిని కోల్పోతే తీవ్రంగా క్షీణించవచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సాంకేతిక విశ్లేషకుడు నాగరాజ్ షెట్టి అంచనా వేశారు. 17,700 స్థాయి అవరోధం కల్గించవచ్చని అన్నారు.