న్యూఢిల్లీ, జూన్ 29: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. జూలై 1 (గురువారం) నుంచి కొత్త చార్జీలను అమల్లోకి తెస్తున్నది. ఈ మేరకు మంగళవారం బ్యాంక్ తెలియజేసింది. పరిమితికి మించి నగదును ఉపసంహరించినా, చెక్ బుక్కులు కావాలన్నా ఇకపై బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ల (బీఎస్బీడీ) ఖతాదారులకు అదనపు చెల్లింపులు తప్పనిసరి. వీటిని రూ.15-75 (జీఎస్టీ అదనం) మేర వసూలు చేయనున్నారు.
సర్వీస్ చార్జీల్లో మార్పుల ప్రకారం బీఎస్బీడీ ఖాతాదారులు.. ఏటీఎంల నుంచి నెలకు నాలుగుసార్ల కంటే ఎక్కువగా నగదును ఉపసంహరిస్తే ఒక్కో లావాదేవీపై రూ.15 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్బీఐ శాఖల్లో నగదు విత్డ్రా చేసినా చార్జీ పడుతుంది. అయితే బ్రాంచీల్లో, ఏటీఎం, సీడీఎంలలో నాన్-ఫైనాన్షియల్, ట్రాన్స్ఫర్ లావాదేవీలు ఉచితం.
ఆర్థిక సంవత్సరంలో 10 చెక్కులనే ఉచితంగా ఇవ్వనున్నది. మరో 10 చెక్కులు కావాలంటే రూ.40 చెల్లించాలి. 25 చెక్కుల బుక్కును కోరితే రూ.75 ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అత్యవసర చెక్ బుక్కు కోసం 10 చెక్కులకు రూ.50ని వసూలు చేయనున్నారు. అయితే ఈ చార్జీల నుంచి వృద్ధులకు ఎస్బీఐ మినహాయింపునిచ్చింది.