కొత్తగూడెం అర్బన్/సుజాతనగర్, ఏప్రిల్ 7: ప్రస్తుతం ఎక్కడ చూసినా నగదు రహిత లావాదేవీలు కొనసాగుతున్నాయి. పెద్దనోట్ల రద్దు తరువాత డిజిటల్ లావాదేవీల విధానంపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మొదట్లో పట్టణాలకే పరిమితమైన డిజిటల్ సేవలు ప్రస్తుతం పల్లెలకు విస్తరించాయి. ప్రతీ దుకాణంలో క్యూఆర్ కోడ్ స్క్యానింగ్ కనిపిస్తున్నాయి. ఉద్యోగులు, వ్యాపారులు ఫోన్పే, గూగూల్ పే, పేటీఎం తదితర డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన క్యూర్ కోడ్లు, వాలెట్లను వినియోగిస్తున్నారు. పాన్షాప్ మొదలు పెద్ద పెద్ద దుకాణాల్లో, బస్సులు, రైల్వే టిక్కెట్ల బుకింగ్ల వరకు అన్ని ఆన్లైన్లోనే చేస్తున్నారు. పండ్లు అమ్ముకునే వ్యాపారులు సైతం నగదు రహిత లావాదేవీల వైపు మొగ్గుచూపుతున్నారు. డిజిటల్ లావాదేవీల పుణ్యమా అని వ్యాపారులకు చిల్లర పైసల సమస్యల తీరిపోయింది. మరోవైపు డిజిటల్ లావాదేవీలంటే తెలియని వారిలో సైతం కరోనా మార్పు తీసుకొచ్చింది. వైరస్ ప్రభావంతో నగదు ఇచ్చినా తీసుకునేందుకు ఆలోచిస్తున్నారు.
లక్ష వరకు లావాదేవీలకు వెసులుబాటు
నగదు చెల్లింపు యాప్ల ద్వారా ఆన్లైన్లో ప్రతీ రోజు లక్ష రూపాయల వరకు చెల్లింపులు చేసుకునే వెసులుబాటు ఉంది. దుకాణదారులు, వ్యాపార, వాణిజ్య సంస్థల ద్వారా కార్యకలాపాలు నిర్వహించే వ్యాపారస్తులు తాము ఇతర ప్రాంతాల నుంచి ఆర్డర్ ఇచ్చిన సరుకులకు ఆ ప్రాంతానికి వెళ్లకుండా, బ్యాంకుకు వెళ్లకుండానే కూర్చున్న చోటు నుంచే నగదు లావాదేవీలను నిర్వహిస్తున్నారు. దీంతో తమకు సమయంతో పాటు, శ్రమ తగ్గుతుందనే భావనను వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా తల్లిదండ్రులు దూర ప్రాంతాల్లో విద్యనభ్యసిస్తున్న తమ పిల్లలకు వారి అవసరాలకు ఈ చెల్లింపుల ద్వారానే నిమిషాల్లోనే నగదును సులువుగా బదిలీ చేస్తున్నారు.
ఆన్లైన్ వినియోగదారులు మూడు లక్షలకు పైగానే…
ఆన్లైన్ వ్యవహారాలను నడిపేవారు జిల్లా వ్యాప్తంగా దాదాపుగా మూడు లక్షలకు పైగానే ఉన్నారు. ప్రతి 10మందిలో ఆరుగురు స్మార్ట్ఫోన్ వినియోగిస్తున్నారు. 2011 లెక్కల ప్రకారం జిల్లాలో 10,59,261 మంది జనాభా ఉన్నారు. ఇందులో 7.30లక్షల మందికి పైగానే వివిధ బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్నారు. వీరిలో స్మార్ట్ఫోన్, బ్యాంక్ ఖాతా కలిగి ఉన్నవారు 3లక్షల మంది. ఫోన్ పే, గుగూల్ పే ద్వారా ఆన్లైన్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.
చెల్లింపుల్లోనూ పారదర్శకత
మనం ఎంత కొనుగోలు చేశామో ఒక రూపాయి ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా కచ్చితంగా పైసలతో సహా చెల్లించే అవకాశం డిజిటల్ చెల్లింపులో ఉంది. మనం చెల్లించిన నగదు అవతలి వ్యక్తి ఖాతాకు బదిలీ అయిందా? లేదా? అనే విషయం కూడా స్పష్టంగా తెలిసిపోతుంది. మన ఖాతా నుంచి ఎవరికీ ఎంతెంత, ఏ రోజు చెల్లించామో కూడా స్పష్టం తెలిసిపోతుంది.
ఈజీగా నగదు బదిలీ చేసుకోవచ్చు..
ఏదైనా బంగారం వస్తువును కొనుగోలు చేయాలంటే వేలరూపాయలు అవుతుంది. డబ్బులను జేబుల్లోనో, పర్సుల్లోనే తీసుకురావడం ఇబ్బంది. కొనుగోలు చేసే వ్యక్తులకు డిజిటల్ చెల్లింపులు చేసే అవగాహన ఉంటే సులువుగా నగదును చెల్లించవచ్చు. లక్ష రూపాయల వరకు ఫోన్ పే, గుగూల్ పేల ద్వారా చెల్లించే వేసులుబాటు ఉంది. ప్రస్తుతం దాదాపుగా ప్రతీ దుకాణంలో ఈ సౌకర్యం ఉంది.
-ఎండీ.రియాజ్ (బంగారం షాపు దుకాణదారుడు)
చిల్లర పైసల సమస్య తీరిపోయింది..
ఏ షాపులో చూసినా డిజిటల్ లావాదేవీలు సాఫీగా సాగుతున్నాయి. ఈ విధానంతో చిల్లర పైసల సమస్యల తీరిపోయింది. జేబులో డబ్బులు లేకపోయినా చేతిలో సెల్ఫోన్ ఉంటే చాలు వచ్చి షాపింగ్ చేసుకుంటున్నాం. ఎక్కువశాతం అన్ని దుకాణాల్లో ఫోన్పే, గూగూల్పే ద్వారా క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసి నగదును చెల్లిస్తున్నాం. నగదు రహిత లావాదేవీలు బాగున్నాయి. ఏటీఎంలకు వెళ్తే సమయానికి నగదు లేక ఇబ్బందులు పడే వాళ్లకే దీనివల్ల సమస్యలు తొలగిపోయాయి.
-మూడ్ హరి, కోమటిపల్లి