తిరుమలగిరి(తుంగతుర్తి), ఏప్రిల్ 16 : 45 ఏండ్లు పైబడిన వారంతా కరోనా టీకా వేయించుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం అన్నారు. శుక్రవారం మండల కేంద్రంతో పాటు వెలుగుపల్లి గ్రామంలో కరోనాతో బాధపడుతూ హోం క్వారంటైన్లో ఉన్న వారిని ఆయన పరామర్శించారు. 14రోజులు తప్పనిసరిగా హోంక్వారంటైన్లో ఉండాలని సూచించారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రపర్చుకోవడం వంటివి చేస్తే వైరస్ మన దరికి చేరదన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్ నాగూనాయక్, ఆరోగ్య విస్తరణ అధికారి సముద్రాల సూరి, సోమయ్య, భారతి, భాస్కర్ పాల్గొన్నారు.
సోలిపేటలో..
సూర్యాపేట రూరల్ : 45 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి అన్నారు. మండలంలోని సోలిపేట గ్రామం లో కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్ బీరవోలు శోభారాణి, ఉపసర్పంచ్ నర్రా సుగుణమ్మ, గోగిరెడ్డి వెంకట్రెడ్డి, తలారి శివ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
200 మందికి టీకాలు
అర్వపల్లి : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో శుక్రవారం 200 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ నవీన్కుమార్ తెలిపారు. ఆయన వెంట సిబ్బంది కుంభం వీరయ్య, నాగమణి, ప్రవీణ, రమణ ఉన్నారు.