కేంద్రాల్లో గురుకుల చీఫ్ విజిలెన్స్ సెక్యూరీటీ ఆఫీసర్ తనఖీ
ఖమ్మంలో 1,457 మంది గైర్హాజరు
ఖమ్మం ఎడ్యుకేషన్/ కొత్తగూడెం ఎడ్యుకేషన్/ పాల్వంచ రూరల్, జూలై 18: ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన అర్హత పరీక్ష విజయవంతంగా ముగిసింది. ఖమ్మం రీజియన్ పరిధిలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 2021-22వ సంవత్సరానికి సంబంధించిన పరీక్షను నిర్వహించారు. ఖమ్మం రీజియన్ పరిధిలో మొత్తం 23 సెంటర్లలో పరీక్ష నిర్వహించగా 8,397 మంది విద్యార్థులకు గాను 6,940 మంది విద్యార్థులు హాజరయ్యారు. 1,457 మంది గైర్హాజరయ్యారు. ఖమ్మం జిల్లాలో 11 పరీక్ష కేంద్రాల్లో 4,024 మంది విద్యార్థులకు గాను 3,411 మంది హాజరై 413 మంది గైర్హాజరయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 పరీక్ష కేంద్రాల్లో 1,873 మందికి గాను 1,523 మంది హాజరై 350 మంది గైర్హాజరయ్యారు. మహబూబాబాద్ జిల్లాలోని 7 సెంటర్లలో పరీక్షను నిర్వహించగా 2,500 మంది విద్యార్థులకు గాను 2,003 మంది హాజరై 497 మంది గైర్హాజరయ్యారు. ఖమ్మం రీజియన్ పరిధిలో 82.65 శాతం హాజరు నమోదైనట్లు ఆర్సీవో ప్రత్యూష తెలిపారు. కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల బాలురు, బాలికలు, ములకలపల్లిలోని గురుకులం, ఇల్లెందులోని గురుకుల పాఠశాలల్లో ఈ పరీక్ష జరిగినట్లు డీసీవో డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
కేంద్రాలను తనిఖీ చేసిన సీవీఎస్వో..
గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్షలు జరుగుతున్న కేంద్రాలను ఖమ్మంలో గురుకుల చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎండీ హుస్సేన్ తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఆర్సీవో ప్రత్యూష, ఏఈర్సీవో ఖుర్షీద్పాషాలు పలు కేంద్రాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు అసౌకర్యాలు కలుగకుంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకే విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలను అమలు చేశారు.