అభివృద్ధిలో దూసుకెళ్తున్న గ్రామం
పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు
ప్రత్యేక ఆకర్షణగా పల్లె ప్రకృతి వనం
పారిశుధ్య చర్యలతో స్వచ్ఛత దిశగా అడుగులు
ఆఖరి మజిలీకి తొలగిన అవస్థలు
సుజాతనగర్, జూలై 17: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో నాయకులగూడెం నూతన పంచాయతీలకు ఆదర్శంగా నిలుస్తున్నది. గతంలో సుజాతనగర్ పంచాయతీలో కలిసి ఉన్న నాయకులగూడెం నూతన పంచాయతీగా ఏర్పడి అనతికాలంలోనే అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. సకల సౌకర్యాలతో కళకళలాడుతున్నది. ఇక్కడి పాలకవర్గం పనితీరును ఎవరన్న మెచ్చుకోవాల్సిందే. వైకుంఠధామాన్ని నిర్మించగా చివరి మజిలీకి చింతలేకుండా పోయింది. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుండగా, వీధులన్నీ పరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. పల్లెప్రగతిలో గ్రామంలో ఉన్న మట్టిరోడ్లు, సీసీ రోడ్లుగా దర్శనమిస్తున్నాయి. రాత్రి సమయంలో వీధి లైట్లతో కాలనీలు జిగేల్మంటున్నాయి. ఇక హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
ఆ గ్రామం గతంలో సుజాతనగర్ పంచాయతీలో కలిసి ఉండేది. కొత్త పంచాయతీల ఏర్పాటుతో గ్రామ పంచాయతీగా అవతరించింది. సమస్యలతో సతమతమైన ఆ పల్లెలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘పల్లె ప్రగతి’తో సకల సౌకర్యాలు ఒనగూరాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తుల సమష్టి కృషితో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. గ్రామంలో నిర్మించిన సీసీ రహదారులు, పల్లె ప్రకృతి వనంతో సరికొత్త శోభను సంతరించుకున్నది. ఆ పల్లె ఎక్కడుంది..? అభివృద్ధి తీరు తెన్నులు తెలుసుకోవాలంటే భద్రాద్రిలోని నాయకులగూడెం వెళ్లాల్సిందే..
నాయకులగూడెం పంచాయతీలో మొత్తం 403 ఇళ్లు ఉండగా, 1,560 జనాభా ఉన్నది.
ఈ గ్రామంలో పల్లె ప్రగతి ఊహించని మార్పులు తెచ్చింది. గ్రామ సర్పంచ్ మండే నాగరాజేశ్వరి, పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు, అధికారులు, గ్రామస్తులు సమష్టిగా ఊరిని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారు. పల్లె ప్రగతితో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రూ.15 లక్షలతో గ్రామ పంచాయతీలో రెండు పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. అదే విధంగా రూ.12 లక్షలతో వైకుంఠధామం, రూ.7 లక్షలతో ట్రాక్టర్ను కొనుగోలు చేసి గ్రామంలో చెత్తను ఎప్పటికప్పుడు ఎత్తివేస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు. పల్లెప్రకృతి వనంలో మొత్తం నాలుగు వేల మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు. నర్సరీల్లో 16 వేల వివిధ రకాలకు చెందిన మొక్కలను పెంచుతున్నారు. రూ.1.60 లక్షలతో పంచాయతీకి వాటర్ట్యాంకర్ను కొనుగోలు చేసి నాటిన మొక్కలకు ప్రతిరోజు నీటిని అందిస్తున్నారు. రూ.22 లక్షలతో సుజాతనగర్లో రైతు వేదికను సిద్ధ్దం చేసుకున్నారు. తడిపొడి చెత్తను పంచాయతీ సిబ్బంది ప్రతిరోజు సేకరించి ట్రాక్టర్ ద్వారా డంపింగ్యార్డులకు తరలిస్తున్నారు. తడి, పొడి చెత్త వేయడానికి గ్రామ పంచాయతీల్లో ప్రతి ఇంటికీ రెండు డస్ట్బిన్లను అందజేశారు. తడిపొడి చెత్తను వేరుచేసి సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు. గ్రామంలో పరిశుభ్రతకు ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రతిరోజు ఉదయం పంచాయతీ సిబ్బంది సాయంతో రోడ్లను పరిశుభ్రంగా ఉంచుతున్నాం. తడి పొడి చెత్తలను వేరువేరుగా సేకరించి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నాం. ప్రతిరోజు ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీటిని అందిస్తున్నాం.
-కృష్ణవేణి, పంచాయతీ సెక్రటరీ
ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
ప్రజాప్రతినిధులు, ప్రజల సమిష్టి కృషితో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి గ్రామ పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. పల్లె ప్రగతిని సద్వినియోగం చేసుకొని గ్రామాన్ని సుందరంగా తయారు చేసుకున్నాం. నర్సరీలు, పల్లెప్రకృతి వనం, డంపింగ్ యార్డు, వాటర్ ట్యాంకర్, వైకుంఠధామం ఇలా అన్నింటినీ నిర్మించుకున్నాం. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను కంటిని రెప్పలా కాపాడుకుంటున్నాం.