Gudivada Amarnath | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్న జగన్.. అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చేస్తున్నారు. ఇప్పటికే 11 విడతల్లో నియోజకవర్గ ఇన్ఛార్జిలను ప్రకటించిన వైసీపీ.. తాజాగా మరో రెండు స్థానాలకు ఇన్ఛార్జిలను నియమించింది.
చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కావటి మనోహర్ నాయుడు, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా గుడివాడ అమర్నాథ్ను వైసీపీ నియమించింది. అలాగే కర్నూలు నగర మేయర్గా బీసీ వర్గానికి చెందిన సత్యనారాయణమ్మను నియమించింది. ప్రస్తుతం ఆమె కర్నూలు నగర 25వ వార్డు కార్పొరేటర్గా పనిచేస్తున్నారు.
ఏపీ ఐటీ శాఖ మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్ గతంలో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఇటీవల అనకాపల్లి టికెట్ను భరత్కు కేటాయిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో గుడివాడ అమర్నాథ్కు టికెట్ రావడం కష్టమే అని ఆయన మీద ట్రోలింగ్స్ కూడా జరిగాయి. కానీ అమర్నాథ్ మాత్రం జగన్పైనే నమ్మకం పెట్టుకున్నారు. జగన్ తనకు న్యాయం చేస్తారని చెప్పుకొచ్చారు. దీనికి జగన్ కూడా సానుకూలతనే వ్యక్తం చేశారు. ఇటీవల విశాఖ వెళ్లినప్పుడు అమర్నాథ్ బాధ్యత తనేదనని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే గుడివాడ అమర్నాథ్ను గాజువాక ఇన్ఛార్జిగా నియమించారు.