YS Sharmila | అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు ఉందని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారం చేయడానికో కాదు ప్రజలు ఓట్లేసిందని మండిపడ్డారు. ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించిందని స్పష్టం చేశారు. మీ స్వయం కృతాపరాధం మిమ్మల్ని ప్రతిపక్ష హోదాకి దూరం చేస్తే… ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతాననడం మీ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనమి జగన్ను దుయ్యబట్టారు. అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య దేవాలయమని.. ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రజలు ఇచ్చిన గొప్ప అవకాశమని తెలిపారు.
కూటమి ప్రభుత్వంపైనా వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు దిక్కులేదని.. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని తెలిపారు. మహిళలపై దాడులు ఆగడం లేదన్నారు. ఇసుక మాఫియా రాజ్యమేలుతోందన్నారు. బెల్టు షాపుల దందాను అరికట్టలేదని.. 5 నెలలైనా ఒక్క ఉద్యోగం భర్తీ కాలేదని చెప్పారు. రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతోందని అన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా గొంతుక అయ్యే అవకాశం YCPకి ప్రజలు ఇస్తే… ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని అనడం సిగ్గు చేటు అని షర్మిల విమర్శించారు. ప్రతిపక్షం లేకుంటే సభలోనే ప్రజాపక్షం అవ్వాలని ఇంగితం కూడా లేకపోవడం బాధాకరమన్నారు. 1994లో కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకే పరిమితం అయినా.. కుంగిపోలేదని.. మీ లెక్క హోదా కావాలని మారం చేయలేదని గుర్తుచేశారు. 26 మంది సభ్యులతో సభలో ప్రజల పక్షంగా నిలబడ్డామని తెలిపారు. ఎన్నో సమస్యలపై ఆనాడు టీడీపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ చుక్కలు చూపించిందని అన్నారు. 2014లో కేంద్రంలో 44 సీట్లకే పరిమితం అయినా, 2019లో 52 సీట్లే వచ్చినా ప్రతిపక్ష హోదా కావాలని అడగలేదని తెలిపారు.
హోదా లేకున్నా రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గార్లు ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించారని షర్మిల తెలిపారు. నియంత మోదీ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారని పేర్కొన్నారు. దేశ ప్రజల సమస్యలపై కాంగ్రెస్ గొంతుకగా మారిందని తెలిపారు. ఇప్పటికైనా మీ పిచ్చితనాన్ని పక్కన పెట్టి అసెంబ్లీకి వెళ్లండని సూచించారు. కూటమి నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలని తెలిపారు. అసెంబ్లీకి వెళ్ళే దమ్ము ధైర్యం లేకుంటే YCP శాసనసభా పక్షం మొత్తం రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఇంట్లో కాదు..ఎక్కడైనా కూర్చుని తాపీగా మాట్లాడుకోండని సెటైర్ వేశారు.