YS Jagan | వైసీపీ ముసుగు మళ్లీ తొలగించిందని.. లోనున్న కాషాయ కండువా మరసారి బయటపడిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. బీజేపీకి వైసీపీ బీ టీమ్ అని నిజ నిర్ధారణ అయ్యిందని అన్నారు. వైఎస్ జగన్ ప్రధాని మోదీకి దత్తపుత్రుడే అని రాష్ట్ర ప్రజలకు కుండబద్ధలు కొట్టినట్లు అర్థమైందని అన్నారు.
ఇవాళ ప్రతిపక్షంలో ముసుగులో ఉన్నది మోదీ పక్షమేనని తేటతెల్లమైందని వైఎస్ షర్మిల అన్నారు. బీజేపీ కోసమే పనిచేసే పక్షమేనని రుజువైందని తెలిపారు. అందుకే బీజేపీ అంటే బాబు, జగన్ , పవన్ కల్యాణ్.. ఈ ముగ్గురు మోదీ తొత్తులే అని విమర్శించారు. బీజేపీకి ఊడిగం చేసే బానిసలే అని మండిపడ్డారు. టీడీపీ, జనసేన పార్టీలది తెరమీద పొత్తు అని.. వైసీపీది తెర వెనుక అక్రమ పొత్తు అని విమర్శించారు. వైసీపీ తీరు రాష్ట్రంలో కూటమి పక్షాలతో కుస్తీ.. ఢిల్లీలో మత పిచ్చి బీజేపీతో దోస్తీ అని వ్యాఖ్యానించారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికలో NDA కూటమి నిలబెట్టిన బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి వైసీపీకి సిగ్గుండాలని షర్మిల మండిపడ్డారు. అవినీతి కేసులకు భయపడి బీజేపీకి మళ్లీ దాసోహం అన్నారని విమర్శించారు. ఐదేళ్లు దోచుకుతిన్నది దాచుకోవడానికి బీజేపీకి జై కొట్టారని అన్నారు. ఈ దేశంలో ఓట్ చోరితో రాజ్యాంగం ఖూనీ అయ్యేది YCPకి కనిపించదని అన్నారు. మోదీ ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తుంటే విమర్శించడానికి YCP నోరు పెకలదని.. మణిపూర్, గోద్రా అల్లర్లలో RSS చేస్తున్న రక్తపాతం మీద మౌనం వహిస్తారని అన్నారు. మోదీ అక్రమాలు బయటపెట్టే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురించి మాత్రం ఉవ్వెత్తున లేస్తారని వ్యాఖ్యానించారు. మోదీకి ఆపద వచ్చిందని అండగా నిలబడతారని.. ఈ దేశ ప్రతిపక్షాలన్నీ కలిసి రాజకీయాలతో సంబంధం లేని ఒక తెలుగు బిడ్డ, న్యాయ నిపుణుడిని నిలబెడితే, బీజేపీ నిలబెట్టిన RSS వాదికి మద్దతు ఇస్తారా ? ఇది తెలుగు ప్రజలకు చేసిన ద్రోహం కాకపోతే మరేంటని ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.