YS Sharmila | ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుతో కేంద్ర ప్రభుత్వం ఇంకా చెలగాటం ఆడుతూనే ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ప్లాంట్ను ప్రైవేట్ పరం చేసే కుట్రలకు ఆజ్యం పోస్తూనే ఉందని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని కేంద్రం తక్షణమే క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై ఈ నెల 8న విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ, కూటమి పార్టీ నాయకులు క్లారిటీ ఇవ్వాలన్నారు. SAILలో విలీనం చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వెంటనే విడుదల చేయాలన్నారు.
ఆర్థికంగా స్టీల్ ప్లాంట్ కష్టాలను గట్టెక్కించేందుకు సుమారు రూ.20వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. భవిష్యత్లో స్టీల్ ప్లాంట్కు ఇబ్బంది రాకుండా ప్రత్యేకంగా సొంత గనులను కేటాయించాలన్నారు. ప్లాంట్కున్న 7 మిలియన్ టన్నుల సామర్ధ్యం మేరకు పూర్తి స్థాయిలో స్టీల్ ఉత్పత్తి చేయాలన్నారు.
1400 రోజులుగా ఆందోళనలు చేస్తున్న కార్మికుల డిమాండ్లపై యాజమాన్యంతో స్పష్టత ఇప్పించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. కార్మిక సంఘాలు అడుగుతున్నట్లు మూడేళ్ల పాటు స్టీల్ ప్లాంట్కి ట్యాక్స్ హాలీడే ఇవ్వాలని కోరారు. స్టీల్ ప్లాంట్ భవిష్యత్పై నిర్ణయం ప్రకటించాకే మోదీ విశాఖలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు.