YS Sharmila | అన్నమయ్య ప్రాజెక్టును అనాథ ప్రాజెక్టు కింద మార్చారని కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్రాజెక్ట్ కొట్టుకు పోయి ఐదేండ్లు దాటినా పునర్నిర్మాణానికి దిక్కులేదని ఆవేదన వ్యక్తం చేశారు. 39 మందిని బలిగొన్న ఘోర విపత్తులో జరిగిన నష్టాన్ని పూడ్చే మనసు ప్రభుత్వాలకు లేదని విమర్శించారు. ఐదు ఊళ్లు కొట్టుకుపోతే పునరావాసానికి రూపాయి ఇచ్చింది లేదని.. సర్వం కోల్పోయిన నిరాశ్రయులను నేటికి ఆదుకున్నది లేదని అన్నారు. గత వైసీపీ, నేటి కూటమి ప్రభుత్వాలు కలిసి అన్నమయ్య ప్రాజెక్టును అనాథ ప్రాజెక్టు కింద మార్చారని విమర్శించారు. “అన్నమయ్య..ఇక అంతేనయ్య” అని వ్యాఖ్యానించారు.
గత ముఖ్యమంత్రి జగన్ 800 కోట్లతో మరమ్మతులు అంటూ హడావిడి తప్పా ప్రాజెక్ట్ ను కట్టింది లేదని షర్మిల విమర్శించారు. పునరుద్ధరణ పేరుతో మూడేండ్లు గడిపారే తప్పా… తట్టెడు మట్టి వేయలేదని అన్నారు. బాధిత కుటుంబాలకు ఇండ్లు అందలేదని.. చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు దక్కలేదని చెప్పారు. ఇసుక మాఫియాతో ప్రాజెక్టుకు గండి పడితే అసెంబ్లీ వేదికగా హై లెవెల్ కమిటీలను, దర్యాప్తు కొనసాగిస్తామని కాలయాపన తప్పా జగన్ ఉద్ధరించింది శూన్యమని ఎద్దేవా చేశారు.
అధికారంలో వచ్చిన ఏడాదిలో ప్రాజెక్ట్ కడతామని చెప్పి చంద్రబాబు చేస్తున్నది కూడా మోసమేనని షర్మిల విమర్శించారు. రాజంపేటకు రెండు సార్లు వచ్చి పోయినా ప్రాజెక్ట్ పనులకు మోక్షం లేదన్నారు. 340 కోట్లతో మరమ్మతులు అని చెప్పి రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. డ్యామ్ నిర్మాణం కోసం సర్వేల పేరుతో బాబు సైతం కాలయాపన చేస్తున్నారని అన్నారు. రాజంపేట వేదికగా మళ్లీ మాయమాటలు చెప్పారు తప్పిస్తే ప్రాజెక్ట్ నిర్మాణంపై దిశా నిర్దేశం లేకపోవడం శోచనీయమని అన్నారు. అన్నమయ్య కన్నీటి వ్యథకు శాశ్వత పరిష్కారం చూపాలని కూటమి ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్ చేశారు. గత 5 ఏళ్లుగా నీటి నిల్వ లేక 30 వేల ఎకరాలకు సాగునీరు పారడం లేదని.. లక్షమందికి త్రాగునీరు అందడం లేదని తెలిపారు. వెంటనే పూర్తి స్థాయి నిధులు కేటాయించి అన్నమయ్య ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని, డ్యామ్ ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాలకు హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.