YS Jagan | అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మరోసారి అధికారం చేజిక్కించుకునే దిశగా అధికార వైఎస్సార్ పార్టీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే సిద్ధం పేరుతో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మేమంతా సిద్ధం పేరుతో ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 20 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగేలా ఏర్పాట్లు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు కవరయ్యేలా ఈ యాత్ర కొనసాగనుంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి రోజూ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మొత్తం 21 బహిరంగ సభలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించినట్లు సమాచారం.
ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 26న నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 29. మే 13న ఎన్నికలు నిర్వహించి, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.