YS Jagan | చంద్రబాబు సర్కార్పై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి మండిపడ్డారు. చంద్రబాబు గారూ.. మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపమైనా, మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా అని ప్రశ్నించారు. ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా అని నిలదీశారు. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికల ముందు చంద్రబాబు, కూటమి ఇచ్చిన హామీలను గుర్తుచేశారు.
1.నిరుద్యోగులందరికీ నెలకు రూ.3వేల చొప్పున భృతి
2.ప్రతి అక్కా చెల్లెమ్మకూ నెల నెలా రూ.1500, సంవత్సరానికి రూ.18,000
3.50 ఏళ్లకే పెన్షన్, నెల నెలా రూ.4వేలు.
4.ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20,000, పీఎం కిసాన్ కాకుండా ఇస్తానంటూ మీరు ఇచ్చిన మాట
5.ఎంతమంది పిల్లలు ఉన్నా, ఆ పిల్లలందరికీ, ప్రతి ఒక్కరికీ ఏటా రూ.15,000
6.ప్రతి ఇంటికీ ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఈ రెండేళ్లలో 6 సిలిండర్లు
7.అక్క చెల్లెమ్మలందరికీ ఎక్కడికైనా, ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణం…
8.ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు
ఇవన్నీ వెలగని దీపాలో.. లేక చేశాం అంటే చేశాం అన్నట్టుగా వెలిగించిన అరకొర దీపాలా..? లేక మీరు రాకముందు వరకూ దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పడమా అని ప్రశ్నించారు. వీటితోపాటు స్కూళ్లు, ఆస్పత్రులు, విద్యా, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్, పారదర్శకత ఇవన్నీకూడా వెలగని దీపాలే కదా అని నిలదీశారు. మా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 2019-24 మధ్య.. ఇంటింటికీ అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన దాదాపు 30 పథకాలు అనే దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు, ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రతినిధులు అని విమర్శించారు.