YS Jagan | ఏపీలో అరటి రైతుల కష్టాల గురించి చెబుతూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ‘హలో ఇండియా, ఆంధ్రప్రదేశ్ వైపు ఒక్కసారి చూడండి! ఒక కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలు మాత్రమే! అవును, మీరు విన్నది నిజమే. ఆంధ్రప్రదేశ్లో అరటి రైతులు పడుతున్న కష్టాలు ఇవి.’ అంటూ జగన్ తెలిపారు.
ఒక అగ్గిపెట్టెకన్నా, ఒక్క బిస్కెట్ కన్నా అరటి పండ్లు చవకగా వస్తున్నాయని వైఎస్ జగన్ తెలిపారు. లక్షల రూపాయలు పెట్టి, నెలల తరబడి కష్టపడి సాగు చేసే రైతులకు ఇలాంటి ధర రావడం కన్నీళ్లు తెప్పించే విషయమని అన్నారు. అరటి మాత్రమే కాదు ఉల్లి నుంచి టమోటా వరకూ.. ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని పేర్కొన్నారు. రైతులకు తగిలిన అతిపెద్ద దెబ్బ ఇది అని ఆవేదన వ్యక్తం చేశారు. విపత్తుల సమయంలో ఉచిత పంట బీమా లేదని, ఇన్పుట్ సబ్సిడీలు లేవని.. పెట్టుబడి సహాయం కింద చేసిన హామీలు.. ఇవన్నీకూడా మోసాలేనని నిర్ధారణ అయ్యిందని విమర్శించారు.
తమ పాలనలో, టన్ను అరటికి సగటున రూ. 25,000 ధర లభించిందని జగన్ తెలిపారు. రేట్లు తగ్గిపోయిన పక్షంలో రైతులు నష్టపోకుండా ప్రత్యేక రైళ్లు నేరుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు నడిపించామని గుర్తుచేశారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా కోల్డ్ స్టోరేజ్లు నిర్మించామన్నారు. దీనివల్ల లక్షలాది రైతుల కుటుంబాలను ఆదుకున్నామని తెలిపారు. కానీ నేడు, వ్యవసాయం కూలిపోతుంటే.. రైతులు నష్టాల్లో మునిగిపోతుంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. కిలో ఆహారం 50 పైసలైతే.. ఆ ఆహారాన్ని పండించే రైతుల శ్రమకు కట్టే విలువ ఎంత అని ప్రశ్నించారు.
📢 HELLO INDIA, LOOK TOWARDS ANDHRA PRADESH!
One kilogram of bananas is being sold for just Rs 0.50!
Yes, you heard it right, fifty paise. This is the plight of banana farmers in AP.Cheaper than a matchbox, cheaper than a single biscuit. This is a cruel blow to farmers who… pic.twitter.com/Egqh7oXDRD
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 1, 2025