YS Jagan | రాష్ట్రంలో అధికార దుర్వినియోగం అవుతుందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వసనీయత చాలా ముఖ్యమని తెలిపారు. కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడగాలని వ్యాఖ్యానించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జడ్పీటీసీ, ఇతర నాయకులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలకు వైఎస్ జగన్ భరోసా కల్పించారు.
గత ఐదేళ్లలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చామని వైఎస్ జగన్ తెలిపారు. ప్రతి ఏడాది సంక్షేమ క్యాలెండర్ విడుదల చేశామని.. ఏ పథకానికి ఎంత బడ్జెట్ కేటాయించామో స్పష్టంగా చెప్పామని గుర్తుచేశారు. క్యాలెండర్ ప్రకారం వాటిని విడుదల చేసి అండగా ఉండేవాళ్లమని అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి కనిపించడం లేదని విమర్శించారు. వైసీపీ పాలనకు, టీడీపీ పాలనకు మధ్య తేడాను ప్రజలు గమనించారని పేర్కొన్నారు. రెండు ప్రభుత్వాల్లో ఎవరికి ఎంత మంచి జరిగిందనే దానిపై ప్రతి కుటుంబంలోనూ చర్చ జరుగుతుందని చెప్పారు.
చంద్రబాబు అబద్ధాలు ఇప్పుడు మోసాలుగా మారాయని విమర్శించారు. చంద్రబాబు మోసాలపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుందని అన్నారు. నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో పరిస్థితులు దిగజారాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఓపికతో ముందుకు సాగాలని.. ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. ప్రజల తరఫున పోరాటాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వైసీపీ కార్యకర్తలు కేసులకు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.
గొంతులు నొక్కడానికి, అణచివేయాలన్న ధోరణితో కేసులు పెడుతున్నారని.. వీటికి భయపడాల్సిన అవసరం లేదని వైసీపీ కార్యకర్తలకు జగన్ సూచించారు. తనను 16 నెలలు జైలులో పెట్టారని.. తనను హింసించినట్లుగా ఎవ్వరినీ కూడా హింసించి ఉండరని అన్నారు. అయినా ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగామని చెప్పారు. కేసులు పెట్టడం మినహా వారు చేసేదేమీ ఉండదని ఎద్దేవా చేశారు. రెడ్ బుక్ ఏదైనా పెద్ద విషయమా? అదేదో గొప్ప విషయం అన్నట్లు వ్యవహరిస్తున్నారని టీడీపీ నాయకులపై మండిపడ్డారు. ఇలా అయితే ప్రతి ఒక్కరూ రెడ్బుక్ రాసుకుంటారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇప్పుడు అన్యాయమైన పాలన కొనసాగుతోంది.. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే అని స్పష్టం చేశారు.