YS Jagan | ఏపీలో కల్తీ లిక్కర్పై సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిప్పులు కురిపించారు. చంద్రబాబు గారూ.. మద్యానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిన మీరు, ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్ వన్గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టున్నారని విమర్శించారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో మీ పార్టీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోందని అన్నారు. రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమోకాని, లిక్కర్ సిండికేట్లతో, నకిలీ మద్యం తయారీల ద్వారా, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మీ పార్టీ నాయకులు గడించిన అక్రమ సంపాదనను పైనుంచి కిందివరకూ వీరంతా పంచుకుంటున్నారని విమర్శించారు. వ్యవస్థీకృతంగా ఈ దందా కొనసాగుతోందని ఆరోపించారు.
మీ లిక్కర్ సిండికేట్లకు, గ్రామస్థాయి వరకూ విస్తరించిన బెల్టుషాపుల మాఫియాలకు, కల్తీ మద్యం వ్యాపారానికి అడ్డురాకూడదనే ఉద్దేశంతోనే ఒక వ్యూహం ప్రకారం మీరు ప్రభుత్వ మద్యం దుకాణాలపై విష ప్రచారం చేశారని వైఎస్ జగన్ అన్నారు. ఉద్దేశపూర్వకంగా వాటిని తీసివేసి, వాటి స్థానంలో మీ సిండికేట్లకు అప్పగించారని అన్నారు. మద్యం దుకాణాలు టీడీపీ వాళ్లవే అని తెలిపారు. బెల్టుషాపులు టీడీపీ వాళ్లవే అని పేర్కొన్నారు. ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు టీడీపీ వాళ్లవే అని ఆరోపించారు. అక్రమ మద్యం తయారీ దారులు కూడా టీడీపీ నేతలే అని.. వాళ్లు తయారుచేస్తారు, ఆ తయారు చేసిన దాన్ని మీ వాళ్లే, మీ షాపులద్వారా, మీ బెల్టుషాపుల ద్వారా అమ్ముతారని తెలిపారు. అలా వచ్చిన డబ్బును వాటాలు వేసుకుని పంచుకుంటారన్నారు. రాష్ట్రంలో ప్రతి మూడు బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యమేనన్న వార్తలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని మండిపడ్డారు.
లిక్కర్ వ్యవహారంలో మీ వ్యవస్థీకృత నేరాల ద్వారా ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడ్డమే కాదు, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును మీరు దోచుకుంటున్నారని ఆరోపించారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దుచేసి విచ్చలవిడిగా మద్యం విక్రయాలను పెంచారని అన్నారు. మార్ట్లు పెట్టారు, తిరిగి మళ్లీ ఇల్లీగల్ బెల్టుషాపులు తెరిచారు, ప్రతి వీధిలోనూ పెట్టారు, రాత్రిపగలు తేడాలేకుండా లిక్కర్ అమ్మడం మొదలుపెట్టారు. ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు తెరిచారని మండిపడ్డారు. ఇంత విచ్చలవిడిగా తాగిస్తున్నా సరే, CAG నివేదికల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఐదు నెలల్లో, అంటే ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారానే లిక్కర్ అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం ₹6,782.21 కోట్లు కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఐదు నెలల్లో, విచ్చలవిడిగా లిక్కర్ అమ్మినా సరే ఆదాయం ₹6,992.77 కోట్లు మాత్రమే వచ్చిందని అన్నారు.. కేవలం 3.10% వృద్ధి మాత్రమే ఉందన్నారు. ఎక్కడైనా ప్రతిఏటా సహజంగా వచ్చే 10% పెరుగుదల కూడా రాలేదని.. అంటే దీని అర్థం, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని, సిండికేట్ల రూపంలో, కల్తీ లిక్కర్ తయారీ రూపంలో మీ ముఠా కొట్టేస్తున్నట్టేగా అర్థమని ప్రశ్నించారు.
కల్తీ లిక్కర్ వ్యవహారాలు కొన్ని నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా వెలుగుచూస్తున్నాయని వైఎస్ జగన్ తెలిపారు. ఉత్తరాంధ్రలోనూ, గోదావరి జిల్లాల్లోనూ, ఇప్పుడు రాయలసీమలోనూ ఈ ఘటనలు బయటకు వచ్చాయన్నారు. కానీ విచారణ, దర్యాప్తు తూతూమంత్రంగానే సాగుతున్నాయన్నారు. దీనికి కారణం.. ఈ అక్రమాల వెనుక ఉన్నది మీ బినామీలు అయిన మీ టీడీపీవాళ్లే అని ఆరోపించారు. దీన్ని అరికట్టాలన్న చిత్తశుద్ధి ఉండి ఉంటే, ఇవాళ ములకలచెరువు ఘటన తర్వాత సప్లై చేసిన మద్యం షాపుల్లోనూ, బెల్టుషాపుల్లోనూ విస్తృతంగా తనిఖీలు జరిగి, కల్తీ బాటిళ్లను పట్టుకునేవారన్నారు. కానీ అలా జరగలేదని తెలిపారు.
పైగా దీనికి కారకులైన వారిని రక్షించే ప్రయత్నం చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా స్థాయి ముఖ్యనేత, టీడీపీ ఇన్ఛార్జి కనుసన్నల్లో ఈ కల్తీమద్యాన్ని తయారు చేస్తే, వీరిని తప్పిస్తూ తూతూమంత్రంగా కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసులో నిందితుడు, టీడీపీ ఇన్ఛార్జి అనచరుడు మద్యం దుకాణం వైపు అధికారులెవ్వరూ కన్నెత్తిచూడలేదన్నారు. ఈ నేరాన్నంతటినీ విదేశాల్లో ఉన్న మరోవ్యక్తిపైకి తోసేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అసలు సూత్రధారులను కాపాడేలా స్కెచ్ వేసి, మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు, మీ కార్యాలయ డైరెక్షన్లో రాత్రికి రాత్రే కేసు మార్చేశారన్నారు. దీనికి కారణం, ఈ దందాకు మీ నుంచి, మీ చెప్పుచేతల్లో ఉన్న వ్యవస్థలనుంచి పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టే అని అన్నారు. మీ సొంత ఆదాయాలకోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం న్యాయమేనా అని నిలదీశారు.