అమరావతి : ఏపీలోని పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పనిచేస్తున్న చోటు నుంచి యువకుడిని కిడ్నాపు చేసి దారుణ హత్యకు పాల్పడారు దుండగులు. నరసరావుపేటలో ఓ నగల దుకాణంలో పనిచేస్తున్న రామాంజనేయులు అనే యువకుడిని ముగ్గురు దుండగులు వచ్చి బయటకు తీసుకెళ్లారు. దారిపోడవునా అతడిపై చేయి చేసుకోవడం సీసీ ఫుటేజిలో కనిపించింది. కాగా కిడ్నాప్నకు గురైన రామాంజనేయులును దారుణంగా చంపి మృతదేహాన్ని ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద జాతీయ రహదారి వంతెన కింద గోతం సంచిలో కట్టి పడేశారు.
స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంచిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. కిడ్నాప్నకు గురైన రోజే మృతుడి భార్య తన భర్తను జంగం బాజి అనే వ్యక్తి సహా మరికొందరు షాపులోనికి వచ్చి తీసుకెళ్లారని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారిస్తున్న దశలో మృతదేహం లభ్యం కావడంపట్ల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దుండగులను త్వరలో పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.