అమరావతి : ఏపీలో జోరుగా రాజకీయాలు మారుతున్నాయి. అధికార పార్టీ నుంచి ప్రధాన ప్రతిపక్షంలోకి చేరుతుండగా మరికొందరు అధికార పార్టీలోకి చేరుతున్నారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు (Dadi Veera Badra Rao) కుటుంబం నిన్న పేర్కొన్న విధంగా బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandra Babu) సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఆయన కుమారులు రత్నాకర్, జైవీర్, అనకాపల్లికి చెందిన ముఖ్యనాయకులు టీడీపీ కండువా కప్పుకున్నారు.
వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య (MLC Rama Chandraiah) సైతం టీడీపీ (TDP) లో చేరారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతుండడం ప్రారంభించారు. దీంతో కొందరికి అవకాశాలు చేజారుతుండడంతో అలక చెందిన నాయకులు, మాజీలు ఇతర పార్టీల వైపు దిక్కులు చూస్తున్నారు.
దాడి వీరభద్రరావు కుమారులు వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి ని కనబరుస్తున్నారు. అయితే వైసీపీలో అవకాశం రాని పరిస్థితి ఉండడంతో మంగళవారం వైసీపీకి రాజీనామా చేశారు. దాడి వీరభద్రరావు, సి. రామచంద్రయ్య ఇద్దరు కూడా గతంలో టీడీపీలో క్రియశీలంగా పనిచేశారు. తిరిగి వీరిద్దరూ టీడీపీలో చేరడం రాజకీయంగా వారి నియోజకవర్గంలో పెనుమార్పులు జరుగనున్నాయి.