YS Jagan | వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల వివాదంపై వారి తల్లి వైఎస్ విజయమ్మ స్పందించిన తీరుపై వైసీపీ అసహనం వ్యక్తంచేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉండగా ఆస్తులు పంచలేదని.. ఇప్పుడు ఉన్నవన్నీ కుటుంబ ఆస్తులే అని వైఎస్ విజయమ్మ చెప్పడాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్) ద్వారా సుదీర్ఘ లేఖను విడుదల చేసింది. దివంగత మహానేత వైఎస్ఆర్ భార్యగా, వైసీపీ అధ్యక్షురాలు వైఎస్ జగన్ తల్లిగా విజయమ్మను అమితంగా గౌరవిస్తామని ఆ లేఖలో తెలిపింది. బహిరంగ లేఖ నేపథ్యంలో కొన్ని అంశాలను ఆమె ముందుకు, ప్రజల ముందుకు తీసుకొస్తున్నామని పేర్కొంది.
విజయమ్మ రాసిన లేఖలో జగన్ను లీగల్గా ఇబ్బంది పెట్టేందుకు, తద్వారా బెయిల్ రద్దుకు జరిగిన కుట్ర వ్యవహారాన్ని కనీసం ప్రస్తావించకపోవడం ప్రజలను పక్కదోవపట్టించడమే అని వైసీపీ తెలిపింది. సరస్వతీ కంపెనీ విషయంలో ఈడీ అటాచ్మెంట్ ఉన్నప్పటికీ, తెలంగాణ హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఉన్నప్పటికీ, యాజమాన్య బదిలీ జరిగేలా క్రయవిక్రయాలు చేయకూడదని, అందుకే అటాచ్మెంట్లో ఉందనే విషయం అందరికీ తెలిసినప్పటికీ, సరస్వతీ విషయంలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయవద్దని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలు సహా న్యాయ సలహాలు ఉన్నప్పటికీ, తప్పు అని తెలిసినప్పటికీ మోసపూరితంగా, కుట్రపూరితంగా షేర్లు బదిలీ చేసిన మాట వాస్తవమే కదా? అని ప్రశ్నించింది. షర్మిల భావోద్వేగాలకు, ఒత్తిళ్లకు గురై జగన్కు న్యాయపరంగా, చట్టపరంగా చిక్కులు తెచ్చే ఈ పనికి, తెలిసి కూడా విజయమ్మ ఆమోదించి సంతకం పెట్టడం నిజమే కదా అని నిలదీసింది. విజయమ్మ లేఖలో ఆ అంశాన్ని పూర్తిగా విస్మరించడం ప్రజలను, వైసీపీ అభిమానులను పక్కదోవపట్టించడమే కదా అని చెప్పింది.
లేఖలోని సారాంశం యథాతథంగా..
2024 ఎన్నికల్లో జగన్ ఒక్కరే ఒకవైపున ఉంటే, అటువైపు చంద్రబాబు నేతృత్వంలో రాజకీయ ప్రత్యర్థులు జట్టుకడితే, మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుందనగా, దివంగత మహానేత వైఎస్ఆర్ను ఎఫ్ఐఆర్ లో పెట్టిన, తన కుమారుడ్ని అన్యాయంగా 16నెలలు జైల్లోపెట్టిన కాంగ్రెస్కు ఓటు వేయండంటూ, వైసీపీని ఇబ్బందిపడుతూ వీడియో విడుదలచేసి విజయమ్మ షర్మిలగారివైపు ఉన్నారనే విషయాన్ని చాలా స్పష్టంగాచెప్పారు. దివంగత మహానేత, వైఎస్సార్ రాజకీయ ప్రత్యర్థులకు, వైఎస్సార్ కుటుంబంపై నిరంతరం కుట్రలు పన్నే చంద్రబాబుకు రాజకీయంగా మేలుచేసే ఇలా వ్యవహరించడం ధర్మమేనా? రాజకీయాలు పక్కనపెడితే ఒక తల్లిగా ఆరోజు విజయమ్మగారు మద్దతు సంగతి దేవుడెరుగు, కనీసం తటస్థవైఖరిని మరిచిపోయి, పక్షపాతం వహించిన వైనంచూసి వైఎస్సార్ అభిమానులు తీవ్రంగా కలతచెందారు, బాధపడ్డారు.
ఇప్పుడు షర్మిలగారి భావోద్వేగాలు, ఒత్తిళ్ల ప్రభావంతో, సరస్వతీ కంపెనీ వ్యవహారంలో న్యాయపరంగా ఇబ్బందులు వచ్చి, స్వయంగా ఆమె కుమారుడి బెయిల్ రద్దు కుట్రకు దారితీస్తుందని తెలిసి కూడా మోసపూరితంగా, షేర్ల సర్టిఫికెట్లు పోయాయని చెప్పి, ఒరిజనల్ షేర్ సర్టిఫికెట్ లేకుండా, జగన్ గారి సంతకాలు లేకుండా, ఎవ్వరికీ తెలియకుండా షేర్లను బదిలీచేసి, షర్మిలతోనే విజయమ్మ ఉన్నారని మరోసారి స్పష్టంగా చెప్పారు.
అంతేకాకుండా జగన్కు, షర్మిల వ్యక్తిగతంగా రాసిన ఉత్తరం టీడీపీ సోషల్ మీడియా అక్కౌంట్లో ప్రత్యక్షం కావడం, విజయమ్మ కూడా సంతకం చేసిన ఆ ఉత్తరాన్ని టీడీపీ విడుదల చేయడం, పలు సందర్భాల్లో జగన్పై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేసినా, జగన్ ఏనాడూ తన చెల్లెలను ఉద్దేశించి ఒక్కమాట కూడా మాట్లాడకపోయినా విజయమ్మ ఏరోజూ సరిదిద్దే కార్యక్రమం చేయకపోవడం, ఆమె వైఖరిని ప్రశ్నిస్తున్నాయి.
కోర్టుల్లో ఉన్న కేసులను ప్రతికూల రీతిలో ప్రభావితం చేసేలా షర్మిల ప్రవర్తన, చర్యలు ఉన్నా, ఒకవైపు ఆస్తులపై హక్కులు కోరుతూ, మరోవైపు అందుకు విరుద్ధంగా ఆమె వ్యవహరించినా, తప్పుడు కేసులపై శ్రీ జగన్ చేస్తున్న పోరాటం, వాటి ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపై ఆమెకు ఎలాంటి ఆందోళన లేనట్లు ప్రవర్తించినా, శ్రీ జగన్ గారిని రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీసేందుకు, బలహీనుడిని చేసేందుకు అనుగుణంగా ఆమె నడుచుకున్నా, షర్మిల వేసిన ప్రతి అడుగు కూడా ప్రత్యర్థులకు లబ్ది చేకూర్చేలానే ఉన్నా, మూడు నాలుగేళ్లుగా ఇంత జరుగుతున్నా ఓపికతో, సహనంతో, మౌనంగా ఆ బాధను జగన్ అనుభవించారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు బాధితులు ఎవరు? ఒక తల్లిగా విజయమ్మ బాసట ఎవరికి ఉండాలి? అన్న బలమైన ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది.
రాజకీయాల పేరిట తెలంగాణలో అడుగుపెట్టిన దగ్గరనుంచి ఉన్నప్పుడల్లా జగన్ను షర్మిల ఇబ్బందిపెడుతూనే ఉన్నారు. అక్కడ నుంచి ఒక్కసారిగా మాయమై, రాజశేఖరరెడ్డిని ఎఫ్ఐఆర్లో పెట్టిన పార్టీకి, అన్నను 16 నెలలు జైల్లో అక్రమంగా నిర్బంధించిన పార్టీకి ఈ రాష్ట్ర అధ్యక్షురాలిగా వచ్చారు. పోనీ రాజకీయాలు ఇంతే అనుకున్నా, ప్రజాస్వామ్య విమర్శల పరిధిని దాటి, ఆజన్మాంత శత్రువు మాదిరిగా జగన్ను షర్మిల అనరాని మాటలు అన్నారు. ఎన్నికల సమయంలో జగన్పై దాడి జరిగితే ఎగతాళి చేసి, అమానవీయంగా మాట్లాడింది షర్మిల కాదా? వీటన్నింటినీ జగన్ ఓపికతో భరించారు. మరి రచ్చకెక్కింది ఎవరు? పరువుతీసింది ఎవరు? నిజమైన బాధితులు ఎవరు? జగన్ బాధితులు కాదంటారా?
కుమార్తె ప్రభావం, ఒత్తిళ్లు కారణంగా విజయమ్మ న్యాయ అన్యాయాల విచక్షణను విస్మరించారు. కుమార్తెను వెనకేసుకువచ్చే ధోరణివల్ల, సరస్వతీ కంపెనీల విషయంలో తనవంతు పాత్ర పోషిస్తూ చట్టవ్యతిరేక పనులకు తోడ్పడ్డారు. తన కుమారుడు ఎదుర్కోబోయే చట్టపరమైన సంక్లిష్ట పరిస్థితులేంటో తెలిసి కూడా విజయమ్మ దాన్ని విస్మరించారు. ప్రస్తుత పరిస్థితులకు ప్రధాన కారణం ఇదే.
వైఎస్ఆర్ జీవించి ఉన్నపుడే జగన్ కంపెనీలు నడిపారు, అలాగే షర్మిల తన కంపెనీలను తాను నడిపారు. ఉమ్మడి ఆస్తులు అయితే మరి ఒకరి కంపెనీల్లో ఒకరికి వాటాలు ఎందుకు లేవు? వైఎస్ఆర్ మనోభావాలు, ఆజ్ఞ వేరేలా ఉంటే ఇలా ఎందుకు జరిగి ఉంటుంది? తన కుమార్తెకు వైఎస్ఆర్ తన పూర్వీకుల ఆస్తులతో పాటు, తాను సంపాదించిన ఆస్తులను ఇచ్చాడు. జగన్ ఆస్తులు తనవి కాదు కాబట్టి, ఇవ్వలేదు. ఎందుకంటే ఈ ఆస్తులు జగన్ స్వార్జితం కాబట్టి. వైఎస్ఆర్ బతికి ఉండగానే షర్మిలకి పెళ్లై 10 ఏళ్లు, వైఎస్ఆర్ మరణించి మరో 10 ఏళ్లు గడిచిన తర్వాత, అంటే 20 ఏళ్లు తర్వాత జగన్ తన స్వార్జిత ఆస్తుల్లో కొన్నింటిని చెల్లెలిపై ప్రేమానురాగాల కొద్దీ ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. కోర్టు కేసుల నేపథ్యంలో 2019లో ఆమెకు మంచి చేస్తూ ఒక ఎంఓయూ రాసి ఇచ్చారు. అంతేకాకుండా గడచిన పదేళ్లకాలంలో దాదాపు రూ.200 కోట్లు పైచిలుకు వివిధకాలాల్లో జగన్ నుంచి షర్మిల పొందినా తన సోదరుడి పట్ల ఆమె ఏమాత్రం కృతజ్ఞత చూపలేదు.
తన స్వార్జితంతో సంపాదించిన ఆస్తులను, లవ్ అండ్ అఫెక్షన్తో షర్మిలకు ఇస్తున్నాననిజగన్ ఎంఓయూ రాస్తే,. దానిపై విజయమ్మ, షర్మిల ఇద్దరూ సంతకాలు చేశారు. అంటే దీని అర్థం జగన్ స్వార్జిత ఆస్తుల్లో హక్కులేదని ఆరోజు వారు మనస్ఫూర్తిగా అంగీకరించినట్టేగా? మరి ఇప్పుడు ఉమ్మడి ఆస్తులు అంటూ లేఖలో పేర్కొనడం ప్రజలను తప్పుదోవ పట్టించనట్టే. నిజంగా ఉమ్మడి ఆస్తులు అయితే, వాటిని పంచుకునే పద్ధతి ఇలా ఎంఓయూల రూపంలో ఉండదని, చట్టరీత్యా హక్కుగా వస్తుందని ప్రతికుటుంబానికి తెలుసు.
ఇంత యాగీ చేస్తున్న షర్మిల ఈ సంస్థల్లో ఒక్క రూపాయి అయినా పెట్టుబడి పెట్టారా? ఒక్కరోజైనా కంపెనీ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారా? కంపెనీలకున్న రూ.1400 కోట్ల అప్పుల్లో తన వాటా కింద వ్యక్తిగత పూచీకత్తు ఇస్తూ సంతకం పెట్టారా? లేక రూ.500 కోట్ల నష్టాల్లో అయినా ఆమె పాత్ర పోషించారా? ఈ కంపెనీలకు సంబంధించిన కష్టాల్లో, చిక్కుల్లో, కోర్టు కేసుల్లో ఏరోజైనా తానుగా బాధ్యత తీసుకున్నారా ? పైగా ఈ కంపెనీల మీద, జగన్ మీద ఎవరైతే కేసులు పెట్టారో వారికి రాజకీయ ప్రయోజనం కల్పించేలా వారిని బలపరుస్తూ, కంపెనీలను బలహీనపరుస్తూ సాగుతున్న నడవడిక, వైఖరి చూస్తే ఈ కంపెనీల్లో వాటాలు ఉన్నాయని ఎవరికైనా అనిపిస్తుందా? నిజంగా వాటాలు ఉంటే, ఇలా చేస్తారా? ఇలా జగన్ను, ఆయన కంపెనీలను ఇబ్బందులు పాలు చేస్తారా? ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబ వ్యవహారం కోర్టులో ఉంది. ఇరువురి వాదనలు ప్రజలముందు ఉన్నాయి. ఒకటే వాదనను వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు స్థాయిగల వ్యక్తులు, వివిధ సందర్భాల్లో, వివిధ పద్ధతుల్లో వినిపించడం వల్ల పదేపదే బురదజల్లడం అవుతుంది తప్ప, దీనివల్ల పెద్దగా ఫలితం ఉండదు. ఇప్పుడు ఎవరు చేసింది. సరైనదో, ఎవరివైపు న్యాయం ఉందో కోర్టులే నిర్ణయిస్తాయి.
జగన్ స్వార్జితమైన ఆస్తిలో, ఎలాంటి హక్కు లేకపోయినా, ఆ ఆస్తిలో భాగం కావాలని షర్మిల ఇంత రాద్ధాంతం చేయడం ఏంటి? ఇంత యాగీ చేయడం ఏంటి? ఇన్ని లేఖలు రాయడం ఏంటి? అందులోని లేఖను టీడీపీ విడుదలచేయడం ఏంటి? ఆమె పద్ధతి, ప్రవర్తన మారి, ఆమె తన ప్రేమానురాగాలు చూరగొంటే, కోర్టు కేసులు పరిష్కారం అయిన తర్వాత ఆమెకు ఏమేరకు మంచి చేయాలో, ఎంత చేయాలో, ఏమి చేయాలో ఆరోజు నిర్ణయం తీసుకుంటానని జగన్ ఇదివరకే స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ వ్యక్తిగత కుటుంబ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్లో ఇంకెంతమాత్రం మునిగిపోకూడదని, ప్రజాసమస్యలపై దృష్టిసారిస్తామని ఇదివరకే మా పార్టీ స్పష్టంచేసింది.
ఇట్లు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ