అమరావతి : కాంగ్రెస్లో చేరికలు మొదలయ్యాయి. ఇన్నాళ్లు ఏపీలో స్థబ్దుగా ఉన్న కాంగ్రెస్ వైఎస్ షర్మిల చేరికతో జోష్ పెరిగింది. తన తండ్రి, దివంగల ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డికి సన్నిహితులైన పాతకాపులు సైతం ఒక్కటై షర్మిల (YS Sharmila) కు పూర్తి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. రానున్న మరో రెండు, మూడు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధిష్టానం ఏపీలో మళ్లీ బలపడేందుకు షర్మిలకు పీసీసీ చీఫ్ బాధ్యతలను అప్పగించింది.
ఆమె ఆదివారం విజయవాడలో బాధ్యతలు తీసుకున్న వెంటనే అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ( Alla Ramakrishna Reddy) వైసీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆళ్ల రామకృష్ణరెడ్డికి షర్మిల కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంగళగిరి(Mangalagiri) నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సన్నిహితుడిగా పేరున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్ విధానాలు నచ్చక నెలరోజుల క్రితం పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.