Perni Nani | వైఎస్సార్ కుటుంబం చీలడానికి జగనన్నే కారణమని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. వైఎస్ కుటుంబంలో చీలికలకు ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఎలా కారణమో చెప్పాలని డిమాండ్ చేశారు. షర్మిలకు ఏపీ పరిస్థితులపై అవగాహన లేదని ఆయన విమర్శించారు. వైఎస్సార్ పాలన కంటే జగన్ పాలనలో ఏం తక్కువైందని ప్రశ్నించారు.
అన్న కోసం షర్మిల పాదయాత్ర చేస్తే.. ఏం సంబంధం లేకున్నా జగన్ కోసం మేం జెండాలు మోశామని పేర్ని నాని తెలిపారు. జగన్ కోసం ఎమ్మెల్యే పదవులను కూడా వదులుకున్నామని గుర్తు చేశారు. తన విజయం కోసం తన కుటుంబం మొత్తం ప్రచారం చేసిందని.. గెలిచాకా తన ఫ్యామిలీలోని అందరికీ పదవులు ఇవ్వాలంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ వెనుక చంద్రబాబు ఉన్నారని అందరికీ తెలుసని పేర్ని నాని అన్నారు. వైఎస్ షర్మిలను కావాలనే జగన్పైకి ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్పై షర్మిల పోరాటం ఏమైందని ప్రశ్నించారు.