అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీ జీవోల వల్ల ఉద్యోగుల జీతాలు ఏ మాత్రం తగ్గవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ వెల్లడించారు. కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని, ఒమిక్రాన్ కూడా రెవెన్యూపై తీవ్ర ప్రభావం చూపుతోందని వెల్లడించారు. ఈరోజు మధ్యాహ్నం మీడియా సమావేశంలో ఉన్నతాధికారులతో కలిసి మాట్లాడారు.
కరోనా లేకపోతే రాష్ట్రానికి ప్రతి యేట రూ. 98 కోట్ల ఆదాయం వచ్చేదని, కరోనాతో రూ.62 వేల కోట్లు రెవెన్యూ వస్తుందని పేర్కొన్నారు. రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ ఉద్యోగులకు పీఆర్సీ ఆలస్యమవుతుందనే ఐఆర్ ఇచ్చామని స్పష్టం చేశారు. కరోనా కష్టకాలంలోను ఉద్యోగులకు ఐఆర్ ఇచ్చామని గుర్తు చేశారు. ఐఆర్ వల్ల ప్రభుత్వంపై 17వేల కోట్ల భారం పెరిగుతుందని, 27 శాతం ఐఆర్ గతంలో ఎవరూ ఇవ్వలేదని తెలిపారు. ఐఆర్ అంటే జీతంలో భాగం కాదని ఆయన తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగుల వ్యయం చాల ఎక్కువని వెల్లడించారు.
ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెరిగిందా.. తగ్గిందా అనేది వేరే అంశమని అన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జీతాలు పెంచుతున్నామని వెల్లడించారు. పీఆర్సీ వల్ల గ్రాస్ సాలరీలో ఏమాత్రం తగ్గదు. ఐఏఎస్లకు ఎక్కువ జీతాలు వస్తున్నాయన్నది వాస్తవం కాదని పేర్కొన్నారు. రిటైర్మెంట్ను పెంచడంతో నిరుద్యోగ సమస్య పెరుగుతుందనడంలో నిజం లేదని అన్నారు. థర్డ్ వేవ్ వల్ల ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు సంక్షేమ పథకాలకు ఎలా ఇవ్వాలనేది ఆలోచించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పీఆర్సీని ఫాలో కానున్నామని సీఎస్ ప్రకటించారు.