అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే వారిపై పోలీసులతో ఉక్కుపాదం మోపటం దారుణమని సీపీఐ జాతీయకార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాలోనూ ఉపాధ్యాయులపై పోలీసుల వైఖరిని ఆయన ఎండగట్టారు. అక్షరాస్యులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యం మీద దాడులు చేసినట్టేనని పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఆంబోతులుగా తిరిగే వారిని సలహాదారులుగా నియమించుకున్నారని సీఎం వైఎస్ జగన్ను విమర్శించారు.
హక్కుల కోసం ఉద్యమాలు చేస్తున్నవారిని అణచి వేసేందుకు పోలీసులను వాడుకోవడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన భత్యాలు ఇవ్వకుండా, ఆర్థిక పరిస్థితులు బాగోలేదని కుంటి సాకులు చెప్పడం సబబు కాదన్నారు . మరి సలహాదారులను నియమించుకోవడానికి మాత్రం ఆర్థిక పరిస్థితులు బాగున్నాయా అని ఎద్దేవా చేశారు. ఇవ్వాల్సిన 5 డీ ఏలను అడ్డంపెట్టుకొని పీఆర్సీని ఇచ్చేశామని ప్రభుత్వం చంకలు గుద్దుకుంటుందని ఆరోపించారు. 27 శాతం ఉన్న హెచ్ఆర్ఏ లను 23 శాతానికి కుదించిందని విమర్శించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేస్తామని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ చదువుకున్నవాడా లేదా అని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం తమ మొండి వైఖరిని విడనాడి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ప్రత్యక్ష ఉద్యమంలో భారత కమ్యూనిస్టు పార్టీ కూడా పాలుపంచుకుంటుందని హెచ్చరించారు.