అమరావతి : ఏపీలో అధికార వైసీపీకి మరో ఎమ్మెల్యే దూరం కానున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే(YCP MLA ) వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishnaprasad) రేపు(సోమవారం) తన భవిష్యత్ను ప్రకటిస్తానని వెల్లడించారు. ఆదివారం తన ముఖ్యనాయకులతో నిర్వహించిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. సోమవారం అనుచరులతోనూ చర్చించి భవిష్యత్ ప్రణాళికను ప్రకటిస్తానని తెలిపారు.
వైసీపీ అధ్యక్షుడు , సీఎం వైఎస్ జగన్ (CM Jagan) రాష్ట్రంలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గెలుపొందే అభ్యర్థులను గుర్తించి వారికి నియోజకవర్గంలో ఇన్చార్జిలుగా నియమిస్తున్నారు. ఇన్చార్జిలే ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉంటారని స్పష్టం చేయడంతో నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి పోటికి అవకాశం దక్కడం లేదు.
దీంతో నిరాశ చెందుతున్న ఎమ్మెల్యేలు తమ దారి తాము చూసుకుంటూ ఇతర పార్టీలోకి మారుతున్నారు. ఇప్పటికే వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కొందరు టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలో చేరారు. మైలావరం నియోజకవర్గంలోనూ వసంత కృష్ణ ప్రసాద్ పేరును కాదని మరో వ్యక్తికి అవకాశం ఇవ్వడంతో ఆయన టీడీపీలో చేరే ఆలోచనలో ఉన్నారు.