విజయవాడ: విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని 10, ఇంటర్ పరీక్షలను ఖచ్చితంగా నిర్వహిస్తామన్నారు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఇప్పటికే కరోనా కారణంగా విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, మున్ముందు ఎలా ఉంటుందో చెప్పలేమన్నారు. కరోనా నిబంధనల మేరకే విద్యా సంస్థలను నడిపిస్తున్నామని వెల్లడించారు.
ప్రతి మండలానికి 2, 3 జూనియర్ కళాశాలలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని సురేష్ తెలిపారు. రానున్న రోజుల్లో పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా పేద పిల్లల కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి నూతన విద్యావిధానాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. దీనిలో భాగంగా ఫౌండేషన్ పద్ధతిని ప్రారంభించారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఒక్క స్కూల్ కూడా మూతపడదని.. ఏ ఒక్క టీచర్ ఉద్యోగం పోదని మంత్రి సురేష్ హామీ ఇచ్చారు.
నాడు-నేడు కింద మొదటి విడతలో రూ.3,700 కోట్ల ఖర్చుతో పాఠశాలలను ఆధునీకరించామని మంత్రి సురేష్ చెప్పారు. నూతన పాఠశాలలు, కళాశాలలు మంజూరు చేస్తున్నామని, అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న జూనియర్ కళాశాలలకు అదనంగా మరిన్ని జూనియర్ కళాశాలలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.