అమరావతి : ఎంపీటీసీ, జడ్పీటీసీల ఏకగ్రీవాలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్, రాయచోటి నియోజకవర్గ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్తో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు, కక్ష లేదని పేర్కొన్నారు. అమరావతి అసైన్డ్ భూ వ్యవహారంలో చంద్రబాబుకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వడంపై టీడీపీ నాయకులు మాట్లాడుతున్న తీరు అభ్యంతరకరంగా ఉందని అన్నారు. అమరావతి సహా రాష్ట్రంలోని అన్నిప్రాంతాలను సీఎం జగన్ అభివృద్ధి చేస్తున్నారు. టీడీపీని ప్రజలు నమ్మలేదు కాబట్టే మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించారని అన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మేస్థితిలో లేరని పేర్కొన్నారు.